8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రాష్ట్రంలో 15 వరకు వానలు
పదహారు రైళ్లు రద్దు: రైల్వేశాఖ
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం అతిభారీ నుంచి అ త్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ రెడ్అలర్ట్ జారీచేసింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఒడిశా తీరంలోని వాయవ్య బంగాళఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నది. రాగల 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 15 వరకు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి సోమవారం నాటికి సాధారణం కన్నా 19.18 సెంటీమీటర్ల అధిక వర్షపాతం కురిసింది.
జూన్లో సీజన్ ప్రారం భం నుంచి ఇప్పటివరకు సాధారణంగా సగటు వర్షం 20.39 సెంటీమీటర్లు కురవాల్సి ఉండగా, అధికంగా 39.57 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 10వ తేదీ ఉద యం నుంచి 11వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలో సాధారణంగా 6 మిల్లీ మీటర్ల వర్షం కురువాల్సి ఉం డగా అధికంగా 2.98 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో 29 జిల్లాల్లో అత్యధిక వర్షం కురువగా, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాం బ గద్వాల జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.
రెండు రైళ్లు పాక్షికంగా రద్దు
భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువుల వల్ల రైల్వే ట్రాకులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని, ముందు జాగ్రత్తగా 16 రైళ్ల రాకపోకలను 13వ తేదీ వరకు రద్దు చేసినట్టు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు. కాకినాడ పోర్టు-విశాఖపట్నం స్టేషన్ల మధ్యలో రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని తెలిపారు.