Heavy Rains | భారీ వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసిముద్దయ్యింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల శివారులో ఉన్న పాకాల ఏరు పొంగి ప్రవహిస్తుండటంతో రామపురం, మద్దివంచ గ్రామాలకు అధికారులు రాకపోకలు నిలిపివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ శివారు మున్నేరు వాగు కూడా ఉధృతంగా పారుతున్నది.
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పలు కాలనీలు జలమయమవ్వగా.. శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో భారీ వర్షాలకు పంట పొలాలు, మిర్చి తోటల్లో వరద వచ్చి చేరడంతో నీట మునిగాయి. మండలంలోని బూర్గుపేటలో మారేడుకొండ మత్తడి పడటంతో రోడ్డుపై వరద నీరు నదిలా ప్రవహిస్తున్నది. ములుగు-భూపాలపల్లి ప్రధాన రహదారిపై నుంచి మత్తడి నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇటు ములుగు జిల్లా కేంద్రంలో కుండపోత వాన పడటంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై వరద నీరు నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని గణప సముద్రం మత్తడి పడింది. అలాగే మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అప్పయ్యపల్లి, సీతారాంపురం, కొండాపురం, రంగరావుపల్లి గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి.