భద్రాచలం : భద్రాచలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పెనుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. స్థానిక హరిత హోటల్లో ఓ భారీ చెట్టు కొమ్మలు విరిగి ట్రావెల్స్ వ్యాన్పడిపోయింది. ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.
ఐటీడీఏ ప్రాంగణంలోనూ చెట్లు నేలకూలాయి. కూనవరం రోడ్డులోని సీఆర్పీఎఫ్ క్యాంప్, సరోజినీ వృద్ధాశ్రమం ప్రాంతాల్లో పలు చెట్లు నేలకొరిగి విద్యుత్ తీగలపై పడడంతో స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. మధ్యాహ్నం వరకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. సాయంత్రం ఒక్కసారిగా పెనుగాలులతో వర్షం కురిసింది.
సుమారు గంట పాటు భారీ వర్షం కురవడంతో భద్రాచలం పట్టణం రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ పైపులపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ఆక్సిజన్ అంతా వృథాగా పోయింది. అలాగే భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలోని హాస్టల్ గోడపై చెట్టు విరిగిపడింది.