వికారాబాద్: జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. కాలనీలోని ఇళ్లలోకి వర్షపునీరు చేరింది. పరిగిలో నస్కల్ వాగు పొంగిపొర్లుతున్నది. దీంతో పరిగి-వికారాబాద్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా కందనెల్లి సమీపంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో తాండూరు- హైదరాబాద్ రోడ్డు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ నియోజకవర్గంలోని కాగ్నా నది తోపాటు చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయి.
ఇక కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వానలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. లెండి వాగు పొంగడంతో గోజెగావ్-మద్నూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బిచ్కుంద మండలం రాజోల వద్ద వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రాజోల-బిచ్చుంద మధ్య వాహనాలు నడవడానికి వీలులేకుండా పోయింది.