హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కృష్ణా బేసిన్లో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. ఎగువన కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతోపాటు స్థానికంగా కురుస్తున్న వానలకు కృష్ణాలో భారీగా వరద వచ్చి చేరుతున్నది. కర్ణాటకలోని ఆల్మట్టికి శనివారం సాయంత్రానికి 83 వేల క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రానికి 1.07 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది. దీంతో ప్రాజెక్టులో ఒక్కరోజులోనే 10 టీఎంసీలు వచ్చి చేరాయి. జూరాల ప్రాజెక్టుకు సైతం ఒక్కసారిగా వరద పెరిగింది. శనివారం సాయంత్రానికి 6 వేల క్యూసెక్కులు ఉండగా, ఆదివారం నాటికి 41 వేల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.75 టీఎంసీలకు చేరుకుని జలకళ సంతరించుకున్నది. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం 6వేల క్యూసెక్కుల నుంచి 2 వేల క్యూసెక్కులకు తగ్గింది. మూసీ ప్రాజెక్టుకు ఆదివారం సాయంత్రం వరకు 4,027 క్యూసెక్కులు కొనసాగింది. ప్రాజెక్టు 3 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది.
గోదావరిలో తగ్గిన వరద
గోదావరి బేసిన్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. శనివారం 1.57 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా ఆదివారం సాయంత్రానికి అది 26 వేల క్యూసెక్కులకు పడిపోయింది. నిజాంసాగర్, సింగూరుతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. శనివారం సాయంత్రం 40 మీటర్లకు పడిపోగా ఆదివారంనాటికి మళ్లీ 43 మీటర్ల మేర గోదావరి ప్రవాహం పెరిగింది.
పెన్గంగ ఉధృతి తగ్గుముఖం
పెన్గంగ వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నిలిచిన వాహనాల రాకపోకలు ఆదివారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. భారీ వరద కారణంగా వంతెనకు ప్రమాదం జరిగిందా అనే విషయాలను ఎన్హెచ్ఏఐ ఇంజినీరింగ్ విభాగం అధికారులు పరిశీలించారు. ఎలాంటి అపాయం లేకపోవడంతో రాకపోకలను కొనసాగించవచ్చని నిర్ణయించారు. దీంతో దాదాపు 12 గంటలపాటు నిలిచిపోయిన రాకపోకలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. పోలీసులు, అధికారులు వంతెన వద్ద ఉండి వరద పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఆదిలాబాద్, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్రాజ్ వంతెనను సందర్శించి అధికారులను పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
భద్రాచలం వద్ద శనివారం వరకు దోబూచులాడిన గోదావరి ఆదివారానికి శాంతించింది. శనివారం సాయంత్రం ప్రవాహం 43 అడుగుల నుంచి తగ్గి 42.8 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఎగువన వానలు కురిసే అవకాశం ఉన్నదని, వరద ముప్పు ఇంకా తొలగిపోలేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. ఏజెన్సీలో పొంగి పొర్లుతున్న వాగులు, చెరువులు దాటొద్దని ప్రజలను కోరారు. కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద గోదావరి నది ఉధృతి తగ్గుతూ వస్తున్నది. అదివారం10.35 మీటర్ల ఎత్తులో 5.45 లక్షల క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తోంది.