హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోలు నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నదా? కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను మూసివేయనున్నదా? అందుకే బడ్జెట్లో నిధుల కేటాయింపుల్లో కోత పెడుతున్నదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజా కేంద్ర బడ్జెట్లో పత్తి కొనుగోలు కోసం నిధుల కేటాయింపు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. 2023-24 బడ్జెట్లో పత్తి కొనుగోలు కోసం కేంద్రం కేటాయించిన నిధుల మొత్తం అక్షరాల రూ. లక్ష మాత్రమే. ఈ నేపథ్యంలో పత్తి రైతు నోట్లో కేంద్రం మట్టి కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పత్తి కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకోవాలని కేంద్రం ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నదనే ఆరోపణలున్నాయి.
ఇందుకు తగ్గట్టుగానే బడ్జెట్లో నిధుల్లో కోత పెడుతూ వస్తున్నది. గత ఏడాది బడ్జెట్లో ఎంతో ఆర్భాటంగా రూ. 9,243 కోట్లు కేటాయించిన కేంద్రం, ఆ తర్వాత దాన్ని రూ.780 కోట్లకు కుదించింది. ఈసారి ఏకంగా రూ.లక్షకు తగ్గించింది. ఈ నేపథ్యంలో పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పత్తికి సరైన ధర లభించక రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం పత్తికి మద్దతు ధర రూ. 6,080 ఉన్నది. కానీ రైతుకు క్వింటాలుకు కనీసం రూ.10 వేల ధర పలికితే గానీ గిట్టుబాటు కాని పరిస్థితులున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేతులెత్తేసి రైతులను నట్టేట ముంచుతుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రైతులపై తీవ్ర ప్రభావం
పత్తి కొనుగోళ్లకు అవసరమైన నిధుల్లో కేంద్రం కోత పెట్టడం తెలంగాణ రైతులపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ఇందుకు కారణం దేశంలో అత్యధికంగా పత్తి సాగు చేసే మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. మహారాష్ట్ర, గుజరాత్తో పోటీ పడుతూ ఇక్కడి రైతులు అత్యధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు. 2020-21లో రాష్ట్రంలో ఏకంగా 60 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈ ఏడాది ఇది 50 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ విధంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న తెలంగాణ రైతులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.