నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 6: మిగ్జాం తుఫాన్ తెలంగాణపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి, మిర్చి, మక్కజొన్న పంటలు నేలవాలాయి. పత్తి పూర్తిగా కారిపోయింది.
పలుచోట్ల కలాల్లో, రోడ్ల వెంట ఆరబోసిన ధాన్యం తడిసి మద్దయింది. ఖమ్మం జిల్లాలో 83,000 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 13,608 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. ములుగు జిల్లాలో గోదావరి తీర ప్రాంతాల వెంబడి ఉన్న మండలాల్లో మిర్చి పంటలు నీట మునిగాయి.
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 380 మి.మీ వర్షపాతం నమోదైంది. నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో ఇంటి గోడ కూలి నూకతోటి పుల్లారావు, లక్ష్మి అనే దంపతులు మృతిచెందారు. అశ్వాపురం మండలం భీమవరంలో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ పరిధిలోని ఓసీలోకి వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. సుమారు రూ.2 కోట్లు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.