అకాల వర్షం రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. అమ్మేందుకు తెచ్చి ఆరబెట్టిన వడ్లు వాననీటికి కొట్టుకుపోయాయి. గాలివానతో శుక్రవారం పలుజిల్లాల్లో పంటలకూ తీవ్రనష్టం వాటిల్లింది. కోతకొచ్చిన వరిపైరు నేలవాలగా.. చేతికొచ్చిన మామిడి నేలరాలింది. ఉమ్మడి నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Telangana | నమస్తే తెలంగాణ, నెట్వర్క్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కురిసిన వడగండ్ల వాన తీవ్ర నష్టం మిగిల్చింది. డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, మాక్లూర్, నవీపేట్, నందిపేట్ మండలాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షపు నీటి ధాటికి కొట్టుకుపోయింది. ఇందల్వాయి మండల కేంద్రంలో చిన్నవాగు నుంచి తండా వరకు ఉన్న సుమారు 50 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. మాక్లూర్ మండలం ధర్మోరాలో పిడుగుపడి నలుగురు గాయపడ్డారు. నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్లో మూడు మూగజీవాలు మృతి చెందాయి. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో కురిసిన వర్షానికి ధాన్యపు రాశులు తడిసిపోయాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వానకు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన సుమారు 10 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. చేతికొచ్చిన పంట పొలం నేలవాలింది. కోతకొచ్చిన దశలో మామిడికాయలు నేలరాలాయి. వీర్నపల్లి మండలం లాల్సింగ్ తండాలో గాలుల ధాటికి లోక్నాయక్ ఇంటి రేకులు లేచిపోయాయి. సుమారు రూ.50 వేల నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు. అదే గ్రామంలో గడ్డివాము, కరెంటు వైరు రోడ్డుపై పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మండల వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో 600 క్వింటాళ్ల తూకం వేసిన ధాన్యం, 7,800 క్వింటాళ్ల తూకం వేయని ధాన్యం తడిసినట్టు ఏపీఎం నర్సయ్య తెలిపారు. ఇల్లంతకుంట మండలం జంగంరెడ్డిపల్లిలో పారిపెల్లి రాజిరెడ్డి పాడి గేదె పిడుగుపాటుతో మరణించింది. రూ.లక్ష నష్టం జరిగిందని బాధితుడు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గురువారం సాయంత్రం అర్ధరాత్రి వరకు నుంచి కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నారాయణపూర్ గ్రామంలో సిరమోని జంగయ్య ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగు ధాటికి స్లాబు, బాత్రూం రేకులు ధ్వంసం కాగా, కొన్ని దుస్తులు దగ్ధమైనట్టు బాధితుడు తెలిపారు.
యాదాద్రి-భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం, జాల, కొత్తజాల గ్రామాల్లో ఈదురుగాలులతో వడగండ్ల వర్షం కురిసింది. దాంతో వరి చేలు నేలవాలాయి. మామిడి కాయలు రాలాయి. కొట్టాల రేకులు ఎగిరిపోయాయి. కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 60 ఎకరాల్లో ధాన్యంతోపాటు మామిడి తోటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
అకాలవర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం యాదాద్రి జిల్లా రాజాపేట మండలం జాల గ్రామంలో వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న వరి పొలాలతోపాటు నేలరాలిన మామిడి, ధ్వంసమైన కొట్టాలను ఆమె పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణీయాదగిరిగౌడ్, బీఆర్ఎస్ మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, మాజీ సర్పంచ్ గుంటి మధుసూదన్రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ గొల్లపల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ సందిల భాస్కర్గౌడ్, ఆలేరు మార్కెట్ మాజీ డైరెక్టర్ మర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.