Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. గులకరాళ్ల కంటే పెద్దసైజులో వడగండ్లు పడడంతో చేతికచ్చిన వరిపంట నేలపాలైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి.
వడగండ్ల వాన కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం కావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నాలుగైదు రోజుల్లో కోతలు మొదలుపెడుదామనుకుంటే ఇలా జరుగడంపై కంటతడిపెట్టుకున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.