యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/తాండూర్/రెబ్బెన/రఘునాథపల్లి: యాదాద్రి భువనగిరి, మంచిర్యాల, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన ఈదురుగాలులు వీచడంతో చెట్లు, విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. చేతికొచ్చిన పంటలు నేలవాలాయి. కోళ్లఫారాల పైకప్పులు, పశువుల కొట్టాలు నేలమట్టమయ్యా యి. మామిడి, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట, ఆత్మకూరు (ఎం), అడ్డగూడూరులో వడగండ్ల వాన వరి తడిసిముద్దయ్యింది. ఇదే మండలంలోని గట్టుసింగారం, అడ్డగూడూరు, బొడ్డుగూడెం గ్రామాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మోటకొండూర్లో పశువుల కొట్టం రేకులు గాలికి ఎగిరిపోయాయి.
ఆత్మకూరు(ఎం) మండలంలోని పారుపల్లిలో కోళ్లఫారాలు నేలమట్టమయ్యాయి. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలో తోటల్లో మామిడి కాయ లు నేలరాలాయి. కొత్తపల్లిలో పదుల ఎకరాల్లో టమాట, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఇండ్ల పైకప్పులు, రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కేంద్రంతోపాటు గోలేటిలో గాలివాన బీభత్సానికి మామిడి కాయలు నేలరాలాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లితోపాటు ఆయా గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కోమల్ల, కుర్చపల్లి, కోడూ రు గ్రామాల్లో వరి పంట నేలవాలడంతోపాటు మామిడి కాయలు రాలిపోయాయి. గబ్బెటలో జిట్టెబోయిన యాకస్వామి కోళ్ల ఫారం నేలమట్టం కావడంతో సుమారు 3 వేల కోళ్లు మృత్యువాత పడగా రూ.లక్ష నష్టం జరిగిందని బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న అదే గ్రామానికి చెందిన కత్తుల కొమురయ్య తలకు బలమైన గాయమైంది.