Heavy Rains | వానమ్మ సల్లగుండ! అన్నదాతలపై ఎట్టకేలకు తన కరుణ చూపింది. 48 గంటలుగా ఆగకుండా జల్లులు కురిపిస్తూ భూతల్లిని తడిసి ముద్ద చేసింది. దీంతో రైతన్నల మోములో ఆనందం చిగురించింది. ఇంకా ఆలస్యమెందుకని సాగు పనులు మొదలు పెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వానలు భారీ నుంచి అతి భారీగా మారి మరో నాలుగు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్/నెట్వర్క్, జూలై 19 (నమస్తే తెలంగాణ): అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వానలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు వచ్చే నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్, 7 జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. సియర్ సూన్ ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని, నైరుతి రుతుపవనాల ద్రోణి, కొంతమేరకు తెలంగాణ వైపునకు వచ్చిందని వాతావరణ విభాగం సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఆగస్టు మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికారులు జలాశయాల్లో నీటి మట్టం, ఎత్తు తక్కువ కల్వర్టులు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై నిఘా ఉంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలు జిల్లాల కలెక్టరేట్లలో ఇప్పటికే కంట్రోల్ రూమ్లను, హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, దుమ్ముగూడెంలో 11.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో సోమవారం రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నది. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతున్నది. నిజామాబాద్ జిల్లా మాధవ్నగర్లో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. నిజామాబాద్-డిచ్పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నవీపేట మండంలోని జన్నేపల్లి పెద్ద చెరువు అలుగు పారుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి కాలరీస్కు రూ.1.72 కోట్లు నష్టం వాటిల్లింది. వరంగల్లోని పైడిపల్లిలో వర్షానికి తడిసిన గోడ కూలి మీద పడటంతో ఇంట్లో ఉన్న రావిరాకుల విజయ్(38) చనిపోయారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారులోని మున్నేరు వాగు చెక్ డ్యామ్ మత్తడి పోస్తున్నది. గార్ల సమీపంలోని పాకాల ఏరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాంపురం-మద్దివంచ గ్రామ పంచాయతీల మధ్య రాకపోకలు నిలిపివేశారు. ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలంలో పాలెం ప్రాజెక్ట్ ప్రధాన కాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. అధికారులు గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 63 కామారెడ్డిలో 46 చెరువులు అలుగు పోస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వర్షాలతో 436 చెరువుల్లోకి 75 శాతం వర్షం నీరు వచ్చి చేరింది. ఐదు చెరువులు నిండగా సిర్గాపూర్లోని రెండు చెరువులు అలుగు పారుతున్నాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకున్నది. దాంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వ్యవసాయ పనులు కూడా జోరందుకున్నాయి.
ప్రాణహిత ఉప్పొంగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతున్నది. మంగళవారం సాయంత్రానికి 2.34లక్షల క్యూసెక్కుల వరద రాగా.. బుధవారానికి సుమారు 5.41 లక్షలకు చేరింది. ఒక్కరోజులోనే వరద రెట్టింపయ్యింది. భారీగా వరద వస్తుండటంతో లక్ష్మీబరాజ్ 57 గేట్లను ఎత్తారు. 5.25 లక్షల క్యుసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ బేసిన్లోని సమ్మక్కసాగర్, సీతమ్మసాగర్ వద్దకూడా వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. తెలంగాణ లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురుస్తుండటంతో వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. 33.05 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్నది. కృష్ణా బేసిన్లో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టులకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతున్నది. బుధవారం సాయంత్రానికి ఆల్మట్టికి 21 వేల క్యూసెక్కుల వరద నమోదైంది.