Heatwaves | దేశంలో మాడుపగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. జూన్ మాసం సగం గడిచిపోయినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వేడిగాలుల నేపథ్యంలో బిహార్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్లో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రానున్న 24 గంటలపాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. మరో వైపు బిహార్లో హీట్వేవ్ గత 11 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు 2012లో 19 రోజుల పాటు నిరంతరంగా వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి.
మరో వైపు తీవ్ర ఎండల నేపథ్యంలో జార్ఖండ్లో జూన్ 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గోవా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడిగించాయి. ఇదిలా ఉండగా.. పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈశాన్య రాజస్థాన్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమ, మంగళవారాల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తరప్రదేశ్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.