హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వేసవి తీవ్రత పెరిగింది. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురువారాలలో ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 44.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉపరితల ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దీని ప్రభావంతో రంగారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు బుధ, గురువారాలలో వచ్చే అవకాశం ఉందని తెలిపింది.