హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు, రేపు వడగాడ్పులు (Heat waves) వీచే ప్రమాదం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెండు రోజుల్లో పగటిపూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఆరేడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని తెలిపింది.
సాధారణంగా మే నెలలో వడగాడ్పులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది మార్చిలోనే వీస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెల 19, 20 తేదీల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథనిలో అత్యధికంగా 42.9, నల్లగొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. ఇది సాధారణం కన్నా 5 డిగ్రీలు అదనం అని వెల్లడించింది. ఈ రెండు జిల్లాల్లో నిన్న వడగాడ్పులు వీచాయని వెల్లడించింది.