యాదాద్రి భువనగిరి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. గురువారం భువనగిరి పట్టణంలోని తారకరామానగర్లో చిన్నారులపై దాడిచేసి కన్నుగుడ్డు పీకేసిన హృదయ విదారక ఘటన చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తారకరామానగర్లో నివాసముంటున్న రాహుల్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు ప్రియాంశ్.. ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న క్రమంలో కుక్కలగుంపు ఒక్కసారిగా బాలుడిపై దాడికి పాల్పడ్డాయి.
ఈ ఘటనలో రియాన్స్ కన్నుగుడ్డు ఊడి బయటపడింది. దీంతో బాలుడు నొప్పి భరించలేక అల్లాడిపోగా.. వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్కు తరలించారు. భువనగిరిలోని ఆర్బీనగర్లో మరో ఇద్దరు చిన్నారులపైన వీధి కుక్కలు దాడిచేశాయి. కమల్ కుమారుడు అగర్వాల్తోపాటు శంకర్ కొడుకు తన్వీష్ను సైతం తీవ్రంగా గాయపరిచాయి. వీరిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వరుసగా ఘటనలతో బాధిత కుటుంబీకులు, ప్రజలు ప్రభుత్వ దవాఖాన ఎదుట హైవేపై ఆందోళన నిర్వహించారు.