హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ప్రజల జీవనశైలిలో పలు మార్పులు వస్తున్నందున 30 ఏండ్ల వయస్సు పైబడినవారంతా వ్యక్తిగత ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ఆహార నియమాలను తప్పక పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పేర్కొన్నది. ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సూచన చేసింది.
జీవన విధానంలో విస్తృత మార్పులు రావడం, మానసిక ఒత్తిడి పెరగడంతోపాటు నివారణ చర్యలు, రెగ్యులర్ హెల్త్ చెకప్లు లేకపోవడం ఇలాంటి మరణాలకు ప్రధాన కారణమని ఐఎంఏ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ బీఎన్ రావు, ప్రముఖ కార్డియాలజిస్ట్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గురువారం ఓ ప్రకటనలో వివరించారు. కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల గుండెపోట్లు సంభవించడం చాలా తకువని, అయినప్పటికీ దానిపై లోతైన పరిశోధనలు జరగాల్సి ఉన్నదని తెలిపారు.
గుండెపోటు మరణాలపై ఎవరూ ఆందోళన చెందవద్దని, 30 ఏండ్లు పైబడిన వారంతా రక్తపోటు, రక్తంలో చకెర స్థాయిలను తరచూ పరీక్షించుకోవాలని, 40 ఏండ్లు పైబడినవారంతా ఏడాదికోసారి కార్డియాక్ చెకప్ చేయించుకోవాలని సూచించారు. ప్రతి ఒకరూ ఆహార నియమాలను పాటించడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువును అదుపులో పెట్టుకోవాలని, మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు రోజూ కనీసం 6 గంటలైనా నిద్రపోవాలని సూచించారు.