హైదరాబాద్, మార్చి 5 : దేశంలోనే మొదటిసారిగా ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, భద్రపరిచే ‘హెల్త్ ప్రొఫైల్’ శనివారం ప్రారంభమైంది. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని రూపొందించింది. పైలట్ ప్రాజెక్టును శనివారం ములుగు జిల్లాలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రారంభించారు. పలువురికి ఇ-హెల్త్ కార్డులను అందజేశారు. ములుగులో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సీతక, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీహెచ్ శ్రీనివాస్రావు, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. వేములవాడలో హెల్త్ ప్రొఫైల్తోపాటు ఆక్సిజన్ ప్లాంట్, పీఎస్ఏ ప్లాంట్, సీటీ స్కాన్, పాలియేటివ్ కేర్ సెంటర్, పీడియాట్రిక్ వార్డులను ఎమ్మెల్యే సీహెచ్ రమేశ్బాబుతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
ఆరోగ్య తెలంగాణలో భాగం: మంత్రి హరీశ్రావు
సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని సేకరించి, వారి అనారోగ్య సమస్యలను అత్యంత వేగంగా, సురక్షితంగా పరిష్కరించేందుకే ప్రభుత్వం హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఇలాంటి ప్రజల ఆరోగ్య వివరాలు సేకరించే కార్యక్రమం ఉన్నదని చెప్పారు. మన దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణలోనే మొదలవుతున్నదని పేర్కొన్నారు. రెండు జిల్లాల్లో 40 రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్తారని, కుటుంబంలో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా సేకరిస్తారని చెప్పారు. అకడికకడే వారికి ఒక హెల్త్ ఐడీని సృష్టించి, అందజేస్తారని తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలవాలి: మంత్రి కేటీఆర్
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్తో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలువాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. 70 ఏండ్ల చరిత్రలో ప్రభుత్వ దవాఖానాల్లో ఒక్క ఐసీయూ కేర్ సెంటర్ లేదని, స్వరాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఆరోగ్య తెలంగాణలో భాగంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 18 ఏండ్లు నిండిన వారు 4.22 లక్షల మంది ఉన్నారని, 220 బృందాలు ఇంటింటికీ వెళ్లి వీరి వివరాలు సేకరిస్తాయని చెప్పారు. సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో 40 రోజుల్లో పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మిగతా అన్ని జిల్లాల్లో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరినీ పరీక్షించిన తర్వాత హెల్త్ కార్డు ఇస్తారని, ప్రమాదకర పరిస్థితిలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ డాటా ఆధారంగా ఆరోగ్య రంగంలో ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ఎక్కడ ఖర్చు చేయాలో నిర్ణయం జరుగుతుందన్నారు. హెల్త్ ప్రొఫైల్లో భాగంగా స్క్రీనింగ్ చేయడం వల్ల వ్యాధులను నిర్ధారించి అవసరమైన కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్లలో క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉంటే భవిష్యత్తులో అక్కడ క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. గుండె జబ్బుల సమస్యలున్న చోట కార్డియాక్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మెట్పల్లి, కోరుట్ల, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల ప్రాంతాల్లో చాలామంది మహిళలు బీడీలు చుడుతారని తెలిపారు. ఇటీవల రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆరోగ్య సర్వేలో కొంతమందిలో క్యాన్సర్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం అనే గ్రామంలోని ప్రజలందరికీ కిడ్నీకి సంబంధించిన వ్యాధులు సోకాయని, అలాగే నల్గొండ జిల్లాలో ఎక్కువ శాతం ఫ్లోరైడ్ వచ్చిందని అన్నారు.
సీఎం కేసీఆర్ శ్రద్ధతో ములుగు ఎంపిక : మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
దేశంలో ఎక్కడా లేని విధంగా హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో చేపట్టారని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ నిర్వహణ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇప్పటికే రూ.10 కోట్లను విడుదల చేశామని చెప్పారు. విదేశాల్లో మాత్రమే ఉండే హెల్త్ ప్రొఫైల్ సేకరణ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో ప్రారంభించుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించే సందర్భం అని గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
హెల్త్ ప్రొఫైల్ విశేషాలు
హెల్త్ ప్రొఫైల్ కోసం వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి, 18 ఏండ్లు నిండిన వారి ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తారు. ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్ ఇస్తారు. వివరాలన్నింటినీ ‘ఈ-హెల్త్ ప్రొఫైల్’ యాప్లో నమోదు చేస్తారు. ప్రతి బృందం రోజుకు కనీసం 10 ఇండ్లను సర్వే చేయాలి. సగటున రోజుకు 40 మంది ప్రొఫైల్ సిద్ధం చేస్తారు. హెల్త్ టీమ్లో ఒక ఏఎన్ఎం, ముగ్గురు ఆశ కార్యకర్తలు ఉంటారు. ఒక్కో వ్యక్తి సమాచారం సేకరణకు 10-15 నిమిషాలు పడుతుందని అంచనా.
హిమోగ్లోబిన్, ఆర్బీఎస్ పరీక్షలు చేస్తారు. ఫలితాలను బట్టి ఏదైనా రిస్క్ ఉంటే.. రక్త, మూత్ర నమూనాలను సేకరిస్తారు. వారికి 30 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. జనాభాలో 40 శాతం మంది రిస్క్ గ్రూప్లో ఉంటారని అంచనా వేస్తున్నారు.
దీర్ఘకాలిక రోగులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం అందించడం, క్యాన్సర్ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.
నిర్వహించే పరీక్షలు