ములుగు : రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ హెల్త్ ప్రొఫైల్ చేయడానికి ములుగు జిల్లాను ఎంపిక చేశారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్య, వైద్య-ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు పరీక్షలు చేసి వైద్యం చేయడానికి ఆలస్యం జరగకుండా హెల్త్ కార్డ్ చూసిన వెంటనే వైద్యం చేసే విధంగా బాధిత వ్యక్తి సమగ్ర సమాచారం ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డ్లో పొందుపరుస్తారన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. వీటితో పాటు అంగన్వాడీ కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు. స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాల ప్రారంభం కోసం తీసుకునే చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి పాఠశాలను ప్రారంభించాలి విద్యార్థులకు రెగ్యులర్గా ఇచ్చే అన్ని వసతులు అందించాలన్నారు.
వీటికి సంబంధించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎంపీ మాలోత్ కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్లు ఆదర్శ సురభి, రిజ్వాన్ పాషా, ములుగు ఆర్డీఓ రమాదేవి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.