హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. ఇందులో 9 కేసులు హైదరాబాద్లో నమోదు కాగా, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగుచూసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకరు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షల సంఖ్యను రోజుకు 4 వేలకు పెంచాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన ఆయన.. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాప్తి, ముందస్తు చర్యలు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని సూచించారు. అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తేవాలని చెప్పారు. అన్ని రకాల ఔషధాలు, పరికరాల గురించి టీఎస్ఎంఎస్ఐడీసీ సమాచారం అందించాలని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ కిట్లు, ఇతర పరికరాలను వెంటనే కొనుగోలు చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ వచ్చిన నమూనాలను గాంధీ దవాఖానలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్కు పంపాలని తెలిపారు. రోజువారీ కేసుల వివరాలను సాయంత్రం 4 గంటలకు ప్రజలకు తెలియజేయాలని వెల్లడించారు. గత నాలుగేండ్లలో సీఎస్ఆర్ కింద చేపట్టిన పనుల నివేదికలను తయారు చేసి, అందజేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జడ్ చొంగ్తు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణణ్, డీపీహెచ్ రవీందర్నాయక్, డీఎంఈ త్రివేణి, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.