వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 7: సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వు అన్నారు. శనివారం ఎంజీఎంలో సుమారు రూ.10.6 కోట్లతో అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని, టైప్-1 డయాబెటిక్ క్లినిక్ను మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్గా మార్చడానికి సుమారు రూ.1,200 కోట్లతో దేశంలోనే ఎక్కడాలేని విధంగా 24 అంతస్తులతో 36 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఉచితంగా అందించడానికి హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టినట్టు చెప్పారు.
ఉమ్మడి పాలనలో నిలిచిపోయిన గుండె శస్త్రచికిత్సలను వంద శాతం సక్సెస్ రేటుతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కరోనా కాలంలో ఎంజీఎం సుమారు లక్షా ఐదు వేల మందికి వైద్యసేవలను అందించిందని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే నరేందర్ ఓపీ, ఏఎంసీ విభాగాల్లో రోగులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన సేవలను అందించడానికి కృషి చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, ఆర్ఎంవోలు హరీశ్రాజ్, మురళి, రాంకుమార్రెడ్డి పాల్గొన్నారు.