హైదరాబాద్ : బాసరలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆరోగ్య వివరాలను డిజిటల్లో నమోదుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో 6,500 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 1200 మంది విద్యార్థులకు దృష్టి లోపాలు, కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. కంటి అద్దాలు అవసరమైన విద్యార్థులకు శుక్రవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో కంటి అద్దాలు అందజేశారు.
600 మంది విద్యార్థులకు ఎనిమియా ఉందని గుర్తించి వారికి కూడా అవసరమైన మందులను అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలను, వైద్య సిబ్బంది నియామకాన్ని వెంటనే చేపట్టాలని వైస్ ఛాన్సలర్ ను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి ఆరోగ్య వివరాలు సేకరించడంతో పాటు 18 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్ణీత కాలానుగుణంగా పరీక్షలను నిర్వహిస్తూ వాటి ఫలితాలను ప్రత్యేక పోర్టల్లో నిక్షిప్తం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.