Health Department | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖను లంచాల రోగం వేధిస్తున్నది. ప్రతి పనికీ అన్ని స్థాయిల్లో డబ్బు జబ్బు పెరిగిపోయింది. ప్రతి వ్యవహారంలో లంచం ఇవ్వనిదే ఫైల్ కదలని దుస్థితి తలెత్తింది. నల్లగొండ జిల్లాలో దవాఖాన సూపరింటెండెంట్ ఏకంగా రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం అందులో భాగమే. దీనికితోడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఆడియో మరింత సంచలనంగా మారింది. ఏకంగా ఉన్నతాధికారికే డిప్యూటేషన్ కోసం లంచం ఇచ్చానని, రిలీవింగ్ ఆర్డర్కే వేలకు వేలు ముట్టజెప్పాల్సి వస్తున్నదని ఆ ఆడియోలో ఉన్నది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టిసారించినట్టు తెలిసింది. నల్లగొండ ఘటన తర్వాత ఏసీబీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయని తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్ కోఠిలోని ప్రధాన కార్యాలయ అధికారులపై ఫిర్యాదులు అందినట్టు సమాచారం.
డీఎంహెచ్వోలు, మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉన్న సూపరింటెండెంట్లపై ఏసీబీ ఫోకస్ పెట్టినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. డిప్యూటేషన్ కోసం సూపరింటెండెంట్లు, డాక్టర్లు, నర్సులు ఎంత ముట్టజెప్పాలో హైదరాబాద్లో ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఆ మేరకు ముట్టజెప్పి డిప్యూటేషన్ ఆర్డర్ తీసుకొచ్చినా.. పనిచేస్తున్న ప్రాంతం నుంచి రిలీవింగ్ లెటర్లు తీసుకోవడానికి మళ్లీ చేతులు తడపాల్సి వస్తున్నదని తెలిసింది. ఒక్కో లెటర్కు రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సాధారణ క్లర్క్ చేయాల్సిన పనిని డీఎంహెచ్వోలు, సూపరింటెండెంట్లు తమ చేతుల్లోకి తీసుకొని ఆదాయ వనరుగా మార్చుకున్నారని వాపోతున్నారు.
అక్కడ, ఇక్కడ లంచాలు ఇవ్వలేక ఏసీబీని ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యారోగ్యశాఖ అధికారులపై ఆకస్మిక దాడులకు ఏసీబీ సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని డీఎంహెచ్వో కార్యాలయాలు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లపై నిఘా పెట్టినట్టు సమాచారం. ఈ మేరకు ఓ జాబితా కూడా సిద్ధమైందని, త్వరలో వరుసగా దాడులు మొదలవుతాయని తెలిసింది.
కలకలం సృష్టిస్తున్న ఆడియో
‘డిప్యూటేషన్ లెటర్ కోసం కాళ్లమీద పడి రూ.70 వేలు ఉన్న కవర్ను సార్కు ఇచ్చాను’ అంటూ వైద్యారోగ్యశాఖకు చెందిన ఓ మహిళా ఉద్యోగి మరో వ్యక్తికి చెప్తున్న ఓ ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఆడియోలో ఏకంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్నాయక్, మెదక్ డీఎంహెచ్వో డాక్టర్ చందునాయక్ పేర్లను ప్రస్తావించడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె డిప్యూటేషన్ కోసం డీపీహెచ్కు, రిలీవ్ లెటర్ కోసం చందునాయక్కు డబ్బులు ఇచ్చినట్టు ఆ ఆడియోలో ఉన్నది. రూ.500 లేదా వెయ్యి తీసుకొని ఇచ్చే రిలీవ్ లెటర్లకు కూడా రూ.30 వేలు వసూలు చేస్తున్నారంటూ ఆ ఆడియోలో మహిళ వాపోయారు. డాక్టర్లకు కూడా ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయని అందులో ఉన్నది. ఈ ఆడియో ఇప్పుడు వైద్యారోగ్యశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపైనా ఏసీబీ ఫోకస్ చేసినట్టు సమాచారం.