Health News | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఒక ముద్దలో క్యాలరీలు ఎన్ని? కార్బోహైడ్రేట్లు ఎన్ని? షుగర్ కంటెంట్ ఎంత? అని లెక్కలేసుకొని తినే రోజులు వచ్చేశాయి. ఒక ఆహార పదార్థం తినాలంటే వెనకాముందు ఆలోచించి రుచి చూసే కాలం వచ్చేసింది. అవును! ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగటంతో ఆహార నియమాలను కచ్చితంగా పాటిస్తున్నారు. ముఖ్యంగా చక్కెర మోతాదు తక్కువ ఉండే ఆహార పదార్థాలవైపే మొగ్గుచూపుతున్నారు. అందుకే లో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) ఫుడ్కు ఆసక్తి చూపుతున్నారు. మధుమేహం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, సాధారణ బియ్యం, అధిక కార్బోహైడ్రేట్లు ఉండే వాటిని తినడం కంటే తక్కువ జీఐ ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిదని ఆలోచిస్తున్నారు. గత రెండేండ్లలో లో గ్లైసెమిక్ ఫుడ్కు ఆదరణ గణనీయంగా పెరిగిందని 24 మంత్ర ఆధ్వర్యంలో చేసిన అధ్యయనంలో తేలింది.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవన విధానాలతో యువకులు కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాలేనని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కరోనా తర్వాత పౌష్ఠికాహారానికి ప్రాధాన్యం పెరిగింది. జీఐ తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని తేలింది. జీఐ తక్కువగా ఉండే బియ్యానికి క్రమంగా ఆదరణ పెరుగుతున్నట్టు వెల్లడైంది. రెండేండ్లలో వీటి కొనుగోళ్లు రెండింతలు పెరిగాయని 24 మంత్ర అధ్యయనం పేర్కొన్నది.
రక్తంలో చక్కెర విలువను పెంచే తీరును బట్టి జీఐ ఇండెక్స్ను నిర్దేశిస్తారు. తిన్న వెంటనే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగే తీరును బట్టిని ఇండెక్స్ను సూచిస్తుండగా తక్కువ (55 లోపు), మధ్యస్థం (56-69), అధికం (70-100) రేటింగ్ను బట్టి జీఐని సూచిస్తారు. దీని ప్రకారం ఆహారాన్ని 3 భాగాలుగా లెక్కిస్తారని నిపుణులు చెప్తున్నారు. బార్లీ, పచ్చి బఠాణీ, కిడ్నీ బీన్స్, సోయాబీన్స్, స్కీం మిల్క్, హోల్ మిల్క్లో తక్కువ జీఐ ఉండే ఆహార పదార్థాల జాబితాలో ఉన్నాయి.