హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారుతో సామాన్యులకు అచ్చే దిన్ బదులు సచ్చే దిన్ దాపురించాయని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర సర్కారు పేద, మధ్య తరగతి ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర పన్నుతున్నదని ధ్వజమెత్తారు. ఔషధాల ధరలను 12 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయించడం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. వచ్చే నెల నుంచి ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుండటంపై గురువారం ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రజా వ్యతిరేక పాలనతో బీజేపీకి రోజులు దగ్గరపడ్డాయని హరీశ్రావు హెచ్చరించారు. ‘ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం.
ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతోపాటు పెయిన్ కిల్లర్లు, యాంటి బయాటిక్స్, యాంటి ఇన్ఫెక్టివ్స్ వంటి 800పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకు భారం అవుతుంది. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బీజేపీ ప్రభుత్వం పనిగా పెట్టుకొన్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం.. చివరకు జబ్బు చేస్తే ప్రాణాలు కాపాడే మందుల ధరలు కూడా పెంచేందుకు సిద్ధమైంది. ఇది అత్యంత బాధాకరం. దుర్మార్గమైన చర్య. ఇదేనా బీజేపీ చెప్తున్న అమృత్ కాల్? ఇవి అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్. దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి’ అంటూ తీవ్రస్థాయిలోమండిపడ్డారు.