KTR | హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏ విచారణకైనా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశాలు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టం చేశారు. సాగునీటిపై చర్చ, శ్వేతపత్రాల విడుదల సందర్భంగానే ఎంక్వైరీకి డిమాండ్ చేశామని గుర్తుచేశారు. తప్పులుంటే బయటపెట్టాలని, అన్నింటినీ న్యాయపరంగా ఎదురొంటామని తేల్చి చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత మీడియా అడిగిన పలు ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. అధికారం కాంగ్రెసోళ్ల చేతుల్లోనే ఉన్నదని, అధికారాన్ని ప్రజలకు సేవ చేసేందుకు, హమీల అమలుకు వినియోగిస్తారో, కక్ష సాధింపు కోసం వినియోగిస్తారో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. రాజకీయాల్లో పోటీచేసిన ప్రతీసారి గెలుస్తామనే ఆశిస్తామని, ఫలితాలు నిరాశపరిచినా బాధ లేదని చెప్పారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, అందుకు కృతజ్ఞతలు అని తెలిపారు. తాము 1.85 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయామని, అందులో 7-8 సీట్లు నాలుగైదు వేల ఓట్ల వ్యత్యాసంతో ఓడిపోయాయని వెల్లడించారు. ఇది ఘోర అపజయం కాదని, స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. ప్రజల కోసం పోరాడుతామని, ప్రతి అంశంపై రివ్యూ చేస్తామని వివరించారు.
ఎంతో చేశాం.. ప్రచారం చేసుకోలేదు
ఉద్యోగులు, యువత విషయంలో ఎంతో చేశామని, కానీ చెప్పుకోలేక పోయామని కేటీఆర్ అన్నారు. ‘దేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక జీతాలు ఇచ్చాం. దేశంలోనే అత్యధికంగా 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. కానీ, ఆ విషయాలను మేం ప్రచారం చేసుకోలేకపోయాం’ అని చెప్పారు. ‘నిజం గడప దాటేలోపల.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అని పెద్దలు సామత చెప్తుంటారని, అదే జరిగిందని తెలిపారు. నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టార్పై పెట్టే పెట్టుబడికి వ్యత్యాసం గమనించాలని సూచించారు. కరోనా ఆర్థిక ప్రతిష్ఠంభన తర్వాత జీతాల విషయంలో కొంత ఇబ్బంది వచ్చిందని, మిగితా సందర్భాల్లో ఏ ఇబ్బందీ లేదని వివరించారు. ఉద్యోగాల విషయంలో యూట్యూబ్లో కొందరు బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే నివారించలేకపోయామని, తద్వారా కొంత నష్టం జరిగిందని చెప్పారు. దుష్ప్రచారాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, ఆ రోజే స్పందించి ఉంటే బాగుండేదని వెల్లడించారు. తమ తరఫున చిన్న పొరపాట్లు జరిగాయని, సవరించుకొని ముందుకెళ్తామని అన్నారు. ప్రతి గెలుపులో పాఠాలుంటాయని, ప్రతి ఓటమిలో గుణపాఠాలు ఉంటాయని పేర్కొన్నారు.
ప్రతి శాఖకు ఒక షాడో టీం
కాంగ్రెస్ పార్టీ అలవికాని వాగ్దానాలు ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వందరోజుల్లో చాలా చేస్తామని చెప్పారని, వంద రోజుల కౌంట్డౌన్ ప్రారంభమైందని అన్నారు. మొన్నే నాలుక మడతేశారని, నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని, డిప్యూటీ సీఎం మాత్రం తాము అలా చెప్పలేదని అన్నట్టు గుర్తుచేశారు. ‘ఇట్ల ఎన్నో అంశాలున్నాయి. ఆరు గ్యారెంటీలు కాదు, 412 హామీలున్నాయి. వాటి లెక తీశాం. మా పార్టీ తరఫున ప్రతి శాఖకు షాడో టీమ్ ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు. అలాంటిదే మా లెజిస్లేచర్లో ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతిశాఖలో, ప్రతి రంగంలో వీళ్ల పనితీరు, ఏం చేస్తున్నరు? ఏయే నిర్ణయాలు తీసుకుంటున్నరు? వాటన్నింటిని నిశితంగా గమనించి ప్రజలకు వివరిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. దీపస్తంభంగా మారిన తెలంగాణను ఆరనివ్వం, పడిపోనివ్వం’ అని తెలిపారు.