సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ):హైదరాబాద్లో మత్తు ముఠా కొత్త ఎత్తుగడ వేసింది. మాదకద్రవ్యాలకు బదులు నిద్రమాత్రలు, దగ్గు సిరప్లు అమ్ముతూ కొత్త దుకాణం మొదలుపెట్టింది. మాదక ద్రవ్యాలు లేకపోతేనేం.. అండుబాటులో ఉన్న వాటితోనే మత్తు ఎక్కిస్తాం రండంటూ యువతను ఆకర్షిస్తున్నారు. మత్తుకు బానిసలైన వారికి అధికధరలకు నైట్రావెట్ టాబ్లెట్లు, చోకోకాఫ్ సిరప్లను అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ స్పెషల్ క్రైమ్ బృందం, హబీబ్నగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు మందులను, నిద్రమాత్రలను అమ్ముతున్న ఇద్దరిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు.
శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. హబీబ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మాంగర్ బస్తీలో విశ్వసనీయ సమాచారం మేరకు ఓ ఇంటిపై పోలీసులు దాడిచేశారు. ఈ సందర్భంగా మహ్మద్ సర్వర్ అలియాస్ రహీమ్, మహ్మద్ రబ్బానిలను అరెస్టు చేసి వారి నుంచి 77వేల 700 నిద్రమాత్రలు, 170 చాకో దగ్గు సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మందుల విలువ సుమారు పదిలక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు.
నిందితులు బీదర్ నుంచి భారీ మొత్తంలో నిద్రమాత్రలు, దగ్గు సిరప్లను హైదరాబాద్కు తీసుకొని వచ్చి, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అక్రమంగా విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఇటీవల మాంగర్బస్తీలో నిర్వహించిన కార్డన్ సెర్చ్ సందర్భంగా పలువురు గంజాయి సేవించినట్లు గుర్తించిన పోలీసులు మత్తుపదార్థాల విక్రయంపై నిఘా పెంచారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు నిర్వహించిన దాడిలో నిద్రమాత్రలు, దగ్గు సిరప్ల అక్రమ విక్రయాల గుట్టు రట్టయింది. మత్తుకోసం ఈ మందులు యువత, నేరస్తులు వాడుతున్నారని నిందితులు వెల్లడించినట్లు అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసులో జమ్ముభాయ్, మహధరి, వీర్ధరి, ఎచ్చధరి, అమన్లాల్, కోహినూర్ అనే మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు.