Minister Harish rao | సంగారెడ్డి, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): హీరో రజనీకాంత్కు తెలంగాణలోని అభివృద్ధి కనిపించింది కానీ, రాష్ట్రంలోని గజనీలకు కానరావడం లేదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను బాగా అభివృద్ధి చేస్తున్నారని, హైదరాబాద్ను చూస్తే అమెరికాలో ఉన్నట్టుగా ఉన్నదని రజనీకాంత్ ప్రశంసించారని గుర్తుచేశారు. శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా సిద్దాపూర్లో 500 డబుల్ బెడ్రూం ఇండ్లను పేదలకు పంపిణీ చేయడంతోపాటు కాశీపూర్లో బసవభవన్ నిర్మాణానికి శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ను గద్దెదించుతామని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ నేతలు.. ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రిని ఎందుకు గద్దె దించాలనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంతోపాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ను గద్దె దించుతారా? కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నందుకు గద్దె దించుతారా? అని నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నదని, అలాంటి కేసీఆర్ను ఎలా గద్దె దించుతారని ప్రశ్నించారు.
బీజేపీ లింగాయత్లను ఎందుకు
కేంద్ర ప్రభుత్వం లింగాయత్లను ఓబీసీలో చేర్చడం లేదని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు లింగాయత్లను, బసవేశ్వరున్ని పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ ఒక్కరే లింగాయత్ల ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచారని చెప్పారు. బసవేశ్వరుని జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నామని, ట్యాంక్బండ్పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేశామని, బసవభవన్ నిర్మాణం కోసం కోకాపేటలో రూ.30 కోట్ల విలువైన స్థలం కేటాయించారని వివరించారు. లింగాయత్లను ఓబీసీలో చేర్చాలంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని గుర్తుచేశారు. కేంద్రం లింగాయత్లను ఓబీసీలో చేర్చే అంశాన్ని పట్టించుకోవడం లేదని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సైతం ఓబీసీ అంశాన్ని విస్మరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. బీజేపీకి లింగాయత్లపై ప్రేమ ఉంటే వెంటనే ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇంజిన్ బీజేపీ సర్కారు పాలనలో కర్ణాటకలో నీళ్లు, కరెంట్ లేవని ఎద్దేవా చేశారు.
సంగారెడ్డిలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన టీఎన్జీవో అధ్యక్షుడు సుశీల్బాబు కుటుంబసభ్యులను మంత్రి హరీశ్రావు పరామర్శించారు. సంగారెడ్డి బైపాస్రోడ్డులో ఉన్న సుశీల్కుమార్ ఇంటికి వెళ్లి, సుశీల్కుమార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ లింగాయత్ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. కేసీఆర్ వల్లే హైదరాబాద్లో బసవభవన్ నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. కేసీఆర్ లింగాయత్ సమాజం అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు చింతా ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, కలెక్టర్ శరత్, లింగాయత్ సమాజం అధ్యక్షుడు మధుశేఖర్, ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.