నాగర్కర్నూల్/కోస్గి ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ) : రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థులు వంశీచంద్రెడ్డి, మల్లు రవికి మద్దతుగా ఆయన మంగళవారం జనజాతర సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేయకుంటే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తడా అని హరీశ్రావు సవాల్ చేశారని గుర్తుచేశారు.
‘నేను మామా అల్లుళ్లు హరీశ్రావు, కేసీఆర్లకు సవాల్ విసురుతున్నా.. పంద్రాగస్టులోపు ఆరు నూరైనా, జోగుళాంబ సాక్షిగా మాట ఇస్తున్నా.. రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా. ఆనాడు నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు, మీ పార్టీని రద్దు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అని వ్యాఖ్యానించారు. రైతులు ఆశీర్వదిస్తేనే కాంగ్రెస్, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, రైతుల రుణం తీర్చుకోకుంటే తన జీవితమే వేస్ట్ అని అన్నారు. రాబోయే పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తాం. అని చెప్పారు. వరి వేసుకుంటే ఉరే అని చెప్పిన కేసీఆర్ తాను మాత్రం ఫాంహౌస్లో వరి వేసుకున్నాడని ఆరోపించారు.
బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రధాని మోదీ చేతిలో కత్తిలా మారి పాలమూరు బిడ్డనైన తనను పొడుస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు. పాలమూరు అభివృద్ధిని ఆమె అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్లో డిపాజిట్ గల్లంతైన బీజేపీ తమకు పోటీయే కాదని చెప్పారు. రాష్ర్టానికి, దేశానికి ఆదర్శంగా నిలిచిన బూర్గుల రామకృష్ణారావు, మల్లు అనంతరాములు, మహేంద్రనాథ్, జైపాల్రెడ్డి వంటి నేతలు పాలమూరు బిడ్డలన్నారు.
పాలమూరు బిడ్డగా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పారు. జిల్లాలోని నాయకులు పగోడి చేతిలో చురకత్తులై లేకలేక 70 ఏండ్లకు ఒక్క అవకాశం వస్తే శత్రువులకు సహకరించేలా, దొంగలకు సద్ది మూటలు కట్టేలా తనకు వ్యతిరేకంగా తయారయ్యారని విమర్శించారు. పాలమూరులో వలసలు ఆగలేదు, కరువు పోలేదు, నీళ్లు పారలేదు, కల్వకుర్తి అట్లనే ఉంది, ఆర్డీఎస్ ఆగమైంది అని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి అవకాశం వస్తదోరాదో, రెండు టీఎంసీలతో పాలమూరు పూర్తి చేసి, జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని చెప్పారు.