Kumaraswamy | (స్పెషల్ టాస్క్ బ్యూరో) బెంగళూరు, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఇచ్చే హామీలను అస్సలు నమ్మవద్దని తెలంగాణ ప్రజలకు కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ తమ రాష్ట్రంలో ఇచ్చిన ఐదు గ్యారెంటీలకు అతీగతీ లేదని, అలాంటిది తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఎలా అమలుచేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ గ్యారెంటీలు పచ్చి బోగస్ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినట్టే, తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు హామీలన్నింటినీ నెరవేర్చిందని గుర్తుచేశారు. ఆదివారం బెంగళూరులోని జేడీఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్యారెంటీల పేరుతో ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుయుక్తులు పన్నుతున్నదని ఆరోపించారు. కర్ణాటకలో అమలుచేయలేక చేతులెత్తేసి, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలంగాణకు వెళ్లి అబద్ధాలు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. రూ.లక్ష వరకు పంట రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్.. ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో రాజస్థాన్ రైతులను మోసం చేయాలని చూస్తున్నదని తీవ్రంగా మండిపడ్డారు.
వ్యవసాయానికి 5 గంటల విద్యుత్తు ఇస్తామని చెప్పి, రెండు గంటల కరెంట్ కూడా ఇవ్వటం లేదని కాంగ్రెస్ పార్టీపై కుమారస్వామి ధ్వజమెత్తారు. మరోవైపు విద్యుత్తు చార్జీలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణ సర్కారు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నదని, రైతుబంధు విజయవంతంగా అమలు అవుతున్నదని ప్రశంసించారు. కేసీఆర్ రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నారని, ఈ పథకం కింద రూ.73 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేశారని వివరించారు. పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలు చేస్తామన్న కాంగ్రెస్ అబద్ధాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలని పిలుపునిచ్చారు.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీల్లో ఏది కూడా అమలు కాలేదని కుమారస్వామి విమర్శించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్ప ఏ ఒక్క పథకం సక్రమంగా అమలు కావటం లేదని తెలిపారు. గృహలక్ష్మి ఇప్పటికీ 30 నుంచి 36 లక్షల మంది మహిళలకు అమలు కావడం లేదని వెల్లడించారు. గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్తు ఇస్తామని చెప్పి, ఒక్కో వినియోగదారునికి 30 నుంచి 50 యూనిట్ల వరకు కోత పెడుతున్నదని వివరించారు. విద్యుత్తు కోతలతో 65 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, దాని విలువ రూ.33,700 కోట్లు అని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక రైతులకు ఇంత నష్టం జరిగినా కాంగ్రెస్ సర్కారు ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు. యువనిధి పథకం ఇప్పటికీ ప్రారంభం కాలేదని మండిపడ్డారు. గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లందరికీ భృతి ఇస్తామని, ఇప్పుడు 2023-24లో ఉత్తీర్ణులైనవారికే ఇస్తామంటూ మాట మార్చిందని ధ్వజమెత్తారు. శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే పథకం వల్ల కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక జేసీబీల్లో వెళ్తున్నారని వివరించారు.
కర్ణాటకకు ప్రస్తుతం ఇద్దరు సీఎంలు ఉన్నారని, వీరిలో ఒకరు (సిద్ధరామయ్య) టెంపరరీ సీఎం, మరొకరు (శివకుమార్) డూప్లికేట్ సీఎం అని కుమారస్వామి ఎద్దేవా చేశారు. వీరిద్దరిలో పార్టీ అధిష్ఠానానికి ఎవరు ఎక్కువ డబ్బు సంచులు ముట్టజెప్పితే వారే సీఎం పోస్టులో కొనసాగుతారని ఆరోపించారు. 2013 నుంచి 2018 వరకు సిద్ధరామయ్య సీఎంగా ఉన్నపుడే కర్ణాటకను అప్పులపాలు చేశారని విమర్శించారు. అణగారిన వర్గాల ప్రతినిధిగా చెప్పుకునే సిద్ధరామయ్య.. రూ.కోట్లు విలువ చేసే గడియారం ధరిస్తారని తెలిపారు. ఒక షాపింగ్ మాల్ నుంచి సిద్ధరామయ్య తన ఇంట్లో ఫర్నిచర్ కోసం రూ.కోటి 90 లక్షలు ఖర్చు చేస్తే, మరో వ్యక్తి బిల్లు చెల్లించాడని ఆరోపించారు. కర్ణాటక అప్పు రూ.10 లక్షల కోట్లు దాటినా.. మంత్రులకు కొత్త కార్లు, వారి క్వార్టర్లను అందంగా ముస్తాబు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు నోట్లు ఇస్తే పట్టుబడుతామని తెలివిగా గిఫ్ట్ కూపన్లు పంచడానికి తెరతీసిందని కుమారస్వామి ఆరోపించారు. ఇది కాంగ్రెస్ మాడల్ అని, కర్ణాటక ఎన్నికల్లో ఆ పార్టీ ఇదే విధానాన్ని అనుసరించిందని అన్నారు. ఇలాంటి మోసాల పట్ల తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రూ.8,000, రూ.5,000 క్యూఆర్ కోడ్తో ఉన్న కూపన్లను పంచుతున్నదని, కర్ణాటకలో చివరి నిమిషంలో ఇలాగే చేసిందని ఆరోపించారు. కర్ణాటకలోని రామనగర, మాగడి, కునిగల్, కనుకపుర తదితర 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిఫ్ట్ కూపన్లు పంచిందని తెలిపారు. అయితే ఎన్నికలు ముగిశాక షాపింగ్మాల్స్కు వెళ్తే ఆ కూపన్లు చెల్లుబాటు కాలేదని, ఇదీ కాంగ్రెస్ మోసమని విమర్శించారు. ఈ సందర్భంగా చెల్లని కూపన్లను కుమారస్వామి మీడియాకు చూపించారు. తెలంగాణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఇలాగే మోసం చేసే అవకాశం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లోనూ ఇలాంటి గిఫ్ట్ కూపన్ల మోసానికి కాంగ్రెస్ పాల్పడే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.