HCL | హైదరాబాద్ : హైటెక్ సిటీలో హెచ్సీఎల్ త్వరలో కొత్త క్యాంపస్ను ప్రారంభించనుంది. ఇందులో అదనంగా 5 వేల మంది ఇంజినీర్లకు ఉద్యోగాలను కల్పించనుంది. శుక్రవారం సచివాలయంలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా ఎంచుకున్న విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు. విద్యార్థులకు మెరుగైన శిక్షణతో పాటు, విద్యా వనరులను విస్తరించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో హెచ్సీఎల్ భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువకులకు ప్రయోజనం చేకూర్చే నైపుణ్యాభివృద్ధికి హెచ్సిఎల్తో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధి అవకాశాల కల్పనకు హెచ్సీఎల్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హెచ్సీఎల్కు రాష్ట్ర ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని అన్నారు. హెచ్సీఎల్ వ్యూహత్మక భాగస్వామ్యం యువతకు ఉద్యోగాలను కల్పించటంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలను నేర్పించి సాధికారత కల్పించేందుకు చేపట్టే కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుందని రోష్ని నాడార్ అన్నారు. ఉపాధి అవకాశాలతో పాటు సాంకేతిక సామర్థ్యాలను HCL GUVI పెంపొందిస్తుందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వంతో తమ కంపెనీ భాగస్వామ్యం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించి అభ్యాసకులకు సాధికారత కల్పిస్తుందని అన్నారు. ఔత్సాహిక సాంకేతిక నిపుణులను తయారు చేస్తుందని చెప్పారు.
స్కిల్ యూనివర్శిటీతో పాటు హెచ్సిఎల్ విద్యా కార్యక్రమాలను తెలంగాణలో ఉన్న ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించే ప్రణాళికలు, దీంతో ఎక్కువ మంది లబ్ధి పొందుతారనే ఆలోచనలను కూడా ఈ సమావేశంలో పంచుకున్నారు. హెచ్సీఎల్ రెండేండ్ల కిందట తమ నైపుణ్య విభాగం GUVIని ప్రారంభించింది. దీంతో దేశీయ భాషల్లో సాంకేతిక కోర్సులను అందిస్తోంది. ప్రధానంగా సాంకేతిక విద్యలో భాషా అవరోధాలు తొలిగించేందుకు కృషి చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
HYDRAA | హైడ్రాపై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరు కావాలని రంగనాథ్కు ఆదేశం