హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు తన తీర్పును రిజర్వులో పెట్టింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును తర్వాత వెలువరిస్తామని తెలిపింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తునుంచి సిట్ను తప్పించి.. సీబీఐ లేదా హైకోర్టు నియమించే ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయవాది బీ శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి గురువారం తీర్పును వాయిదా వేశారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ల వాదనలకు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ సమాధానమిచ్చారు. ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు చట్టపరిధిలో నిబంధనలకు లోబడి జరుగుతున్నదని వివరించారు. అయితే, ఏ దశలోనూ నిందితులు సిట్కు సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుకున్నారని తెలిపారు. అవినీతి కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని, సాధారణ పోలీసులు చేయరాదంటూ పిటిషనర్లు చేసిన వాదనలను ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఏసీబీ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణల కేసులను ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని లేదని, ఇతర పోలీసులు కూడా దర్యాప్తు చేయవచ్చునని ఏజీ బీఎస్ ప్రసాద్ సమాధానమిచ్చారు. చట్టప్రకారం దర్యాప్తును సిట్కు అప్పగించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టంచేశారు. సిట్కు దర్యాప్తు చేసే అధికారం లేదంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనలో పస లేదన్నారు. ప్రజాప్రతినిధులపై విచారణ చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్పారు. ముడుపులు తీసుకోవడం నేరమని, దీనిపై ఎవరు ఫిర్యాదు చేసినా పోలీసులు దర్యాప్తు చేయవచ్చునని తెలిపారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసును సిట్ దర్యాప్తు చేయడం చట్టబద్ధమేనని అన్నారు. మొయినాబాద్ ఎస్సై కేసు నమోదు చేశారని, ఆ తర్వాత ప్రభుత్వ జీవోకు అనుగుణంగా కేసు దర్యాప్తు సిట్కు బదిలీ అయ్యిందని ఏజీ వివరించారు. కేసు నమోదు, దర్యాప్తు, సిట్ ఏర్పాటు అంతా చట్టప్రకారమే జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఎర వేసి, ఆధారాలతో సహా పట్టుబడిన నిందితులు ఏ దారీ లేకపోవడంతో సిట్ దర్యాప్తు చేయడానికి వీల్లేదని చెబుతున్నారని ఏజీ తప్పుపట్టారు. తాము దర్యాప్తును అడ్డుకోవడం లేదంటూనే కేసులు వేస్తూ సిట్ దర్యాప్తు ముందుకు సాగకుండా చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఏ సంబంధమూ లేదంటూనే బీజేపీ హైకోర్టులో తొలుత కేసు వేసిందని ఏజీ వివరించారు. సిట్ దర్యాప్తును అడ్డుకునేందుకు ఇప్పటివరకు పిటిషనర్లు చేసిన ప్రయత్నాలన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో వీగిపోయాయని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు స్వతంత్రంగా జరుగాలని సుప్రీంకోర్టు చెప్పిందని, హైకోర్టు పర్యవేక్షణ కూడా అవసరం లేదని తేల్చిందని వివరించారు. నాలుగు వారాల్లోగా సిట్ దర్యాప్తు చేయాలని కూడా చెప్పిందన్నారు. సిట్ నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతున్నదని, దానిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని ఏజీ వాదించారు. పిటిషనర్లు కోరుతున్న సీబీఐ గతంలో చేపట్టిన పలు కేసుల్లో దర్యాప్తు వీగిపోయిందని గుర్తుచేశారు.
అనుబంధ పిటిషన్లపై విచారణ అవసరం లేదు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీసీ కెమెరా ఫుటేజీలతో కూడిన సీడీలు, పెన్డ్రైవ్, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలంటూ పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరుపాల్సిన అవసరంలేదని ఏజీ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు. తనను సిట్ విచారణ చేసినప్పటి వీడియో కాపీ ఇవ్వాలంటూ న్యాయవాది బీ శ్రీనివాస్ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏజీ ఈ విన్నపం చేశారు. అనుబంధ పిటిషన్లపై విచారణ అవసరంలేదని, సీబీఐ దర్యాప్తు కోరుతూ వేసిన ప్రధాన పిటిషన్లపై విచారణ పూర్తిచేసి తీర్పు చెప్పాలని ధర్మాసనాన్ని కోరారు. అనుబంధ పిటిషన్లపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలని పిటిషనర్లకు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్రెడ్డి అవకాశం ఇచ్చారు. ప్రధాన పిటిషన్లపై తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.