హైదరాబాద్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 28 నెలలు గడుస్తున్నా హైదరాబాద్ నగరంలో ఒక ఇంటినైనా ( House ) నిర్మించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం అసెంబ్లీ( Assembly ) సమావేశంలో ఆయన మాట్లాడారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కార్యక్రమంతో పేద ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు.2.31 లక్షల ఇండ్లను మంజూరు చేసి 1.62 లక్షల ఇండ్లను నిర్మించామని, జంటనగరాల పరిధిలో 65 వేల ఇండ్లను లాటరీ విధానంలో పారదర్శకంగా లబ్ధిదారులకు కేటాయించామని వెల్లడించారు. సనత్ నగర్ లోని ఐడీహెచ్ కాలనీలోనే మొట్టమొదట డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
నాటి గవర్నర్ నరసింహన్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూసి గొప్పగా అభినందించారని గుర్తు చేశారు.జంట నగరాలలోని బస్తీలలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను స్థానికంగా 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న అర్హులైన పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై విమర్శలు చేస్తున్న వారు తనతో వస్తే బీఆర్ఎస్ హయాంలో ఎంత గొప్పగా నిర్మించామో చూపిస్తామని సవాల్ విసిరారు.