చెమ్మగిల్లిన కండ్లతో.. మనసు నిండా దీవెనలతో
సహాయం అందించిన కేసీఆర్కు ధన్యవాదాలు
తెలంగాణ రుణం తీరదన్న రైతు కుటుంబాలు
కేసీఆర్ పోరాటానికి అండగా ఉంటామని నినాదాలు
ఉద్విగ్నంగా సాగిన సభ.. ఆసక్తిగా గమనించిన దేశం
అది చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియం.. ఎవరి ఒంటిపై ఏ పార్టీ కండువా లేదు, ఎక్కడా పార్టీల జెండాలు లేవు. కానీ వేలాది మంది ఒక్క చోట చేరారు. అందరూ రైతులు, రైతునాయకులే. వాళ్ల మనసు నిండా గాయాల ముద్రలే.. కండ్ల కింద కన్నీటి చారలే. కనికరం లేని కేంద్రం.. కర్షకుడిని కాష్టంపై పడుకోబెట్టిన చేదు జ్ఞాపకాలతో ఆ ప్రాంగణం అంతా నిండిపోయింది. దేశ రైతాంగం కోసం వాళ్లింటి రైతన్న అమరుడైతే, ఆ కుటుంబానికి దేశం మొత్తం అండగా ఉంటుందని చాటి చెప్పిన సందర్భం అక్కడ చోటుచేసుకొన్నది. రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ సర్కారు వచ్చి తమకు అండగా నిలుస్తుంటే అక్కడున్న రైతులంతా చెమ్మగిల్లిన కండ్లతో చేతులెక్కి మొక్కారు. తెలంగాణ రుణం తీరేది కాదని గుండెల నిండా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): చండీగఢ్ చెమ్మగిల్లింది. కేంద్రం అనాలోచితంగా తెచ్చిన మూడు సాగు చట్టాలపై పోరాటంలో అమరులైన రైతు కుటుంబాలకు అండగా నిలిచిన కేసీఆర్కు చేతులెత్తి మొక్కింది. ఆదివారం చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్తో కలిసి అమర రైతు కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందించారు. గల్వాన్ లోయలో అమరులైన నలుగురు పంజాబ్ సైనిక కుటుంబాలకు కూడా ఇదే వేదికపై రూ.10 లక్షల చొప్పున అందజేశారు. మధ్యాహ్నం నుంచే పంజాబ్, హర్యానా రాష్ర్టాల నుంచి వచ్చిన రైతులు, రైతు కుటుంబాలు, ఆయా రాష్ర్టాల రైతు నాయకులతో ఠాగూర్ స్టేడియం నిండిపోయింది. స్టేడియం ప్రాంగణం ముఖ ద్వారం వద్ద ‘రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు, దేశ రక్షణ కోసం గల్వాన్ లోయలో అమరులైన జవాన్లకు శ్రద్ధాంజలి’ అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన బాధిత కుటుంబాలు ఉద్విగ్నానికి లోనయ్యాయి. ముగ్గురు సీఎంలు వేదికపైకి రాగానే సభికులంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నప్పుడు ప్రాంగణమంతా గంభీరతను సంతరించుకొన్నది. ఇది సంతోషపడాల్సిన సమయం కాదు.. దుఃఖపడాల్సిన సందర్భం.. మీరు ఒక్కరు కాదు. మీ వెనుక మేమున్నాం. యావత్తు దేశం ఉన్నది’ అన్నప్పుడు రైతు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
‘తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయం మరువలేనిది. 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ.. పంజాబ్కు వచ్చి మా రైతులను ఆదుకోవటం మేమెన్నటికీ మర్చిపోం’ అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ అనగానే సభికులు రెండు చేతులెత్తి మొక్కారు. ‘కేంద్రం రైతుల రక్తాన్ని పీల్చుమని చెప్తున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నది. నా ప్రాణాలు పోయినా సరే మా రాష్ట్రంలో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనియ్య’ అని సీఎం కేసీఆర్ ప్రకటించగానే ప్రాంగణమంతా ఒక్కసారిగా చప్పట్లతో మార్మోగింది. తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్నదని సీఎస్ సోమేశ్కుమార్ చెప్పగానే రైతులు చప్పట్లతో అభినందించారు. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు వేదిక పంచుకోవటం, వేలాదిగా రైతులు, రైతు నాయకులు రావటాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించింది.