లోకల్ఫుడ్కు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు
టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్టీడీసీ
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) వివిధ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, బాంకెట్ హాళ్లు, ఫుడ్కోర్టుల నిర్వహణను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించనున్నది. మూడు హరిత రెస్టారెంట్లు, ఒక ఫుడ్ కోర్టు, రెండు బాంకెట్ హాళ్లు, ఒక ఫుడ్ ఔట్లెట్ నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తున్నది. హైదరాబాద్ మాదాపూర్లోని దుర్గం చెరువు దగ్గర ఉన్న బాంకెట్ హాల్, ఫుడ్కోర్ట్, ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం హరిత రెస్టారెంట్, సిద్దిపేట జిల్లాలోని కోమటి చెరువు హరిత రెస్టారెంట్, బాంకెట్ హాల్, హైదరాబాద్లోని తారామతి బారాదరి హోటల్ ఫుడ్ ఔట్లెట్, ట్యాంక్బండ్ హరిత రెస్టారెంట్ లీజు జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే ప్రారంభమైన టెండర్ల స్వీకరణ జూన్ 10తో ముగియనున్నది.
స్థానిక వంటకాలకు ఆదరణ.. లాభాల బాటలో హోటళ్లు
రెస్టారెంట్లను లీజుకు ఇచ్చే ట్రెండ్ ఎన్నో ఏండ్లుగా కొనసాగుతూ వస్తున్నది. దానికి కాస్త కొత్తదనం జోడించి తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ పర్యాటక ప్రాంతాల్లో స్థానికంగా లభించే ఫుడ్ను అందించే ఉద్దేశంతో రెస్టారెంట్ల నిర్వహణను స్థానికులకు అప్పగిస్తున్నది. గతంలోనూ స్థానిక ప్రైవేటు వ్యక్తులకు రెస్టారెంట్లను అప్పగించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. ఉదాహరణకు 2020 వరకు రూ.1.7 లక్షల నష్టాల్లో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని హరితహోటల్ ప్రైవేటుకు ఇచ్చాక రూ.3 లక్షల లాభాల్లోకి వచ్చింది. ఇలా స్థానిక ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఇతర ప్రాంతాల్లోనూ మంచి ఫలితాలు వస్తున్నాయి. పర్యాటకుల నుంచి స్పందన కూడా బాగుంటున్నది. దీంతో ఇదే ప్రాతిపదికన నష్టాలను తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకునే దిశగా పర్యాటకాభివృద్ధి సంస్థ అడుగులు వేస్తున్నది. స్వదేశీ దర్శన్ కింద కొత్తగా నిర్మించిన హోటళ్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రైవేటుకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అందులో భాగంగానే హోటళ్లను లీజుకు ఇస్తున్నామని పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు తెలిపారు.
ఐదేళ్ల వరకు ఒప్పందం: మనోహర్రావు, టీఎస్టీడీసీ ఎండీ
టెండర్ ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తాం. వారితో కార్పొరేషన్ ఐదేండ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఆసక్తి ఉన్నవాళ్లు వివరాలను టీఎస్టీడీసీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. హిమాయత్నగర్లోని టూరిజం ప్రధాన కార్యాలయాన్ని కూడా సంప్రదించొచ్చు.