సిద్దిపేట, జూన్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కార్ అసమగ్ర ధాన్యం కొనుగోళ్ల కారణంగా మరో రైతు ఊపిరి ఆగింది. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 45 రోజులు కొనుగోలు కేంద్రంలో నిరీక్షించడమే గాకుండా, భారీగా ధాన్యం తరుగు తీయడంతో మనోవేదనకు గురైన రైతు గుండెపోటుతో శనివారం అసువులు బాశాడు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో జరిగిన ఈ ఘటనతో రైతులోకం కన్నీరు పెడుతున్నది. నారాయణరావుపేట గ్రామానికి చెందిన రైతు పల్లెవేని కనకయ్య (46) తనకున్న 6.11 ఎకరాల వ్యవసాయ భూమిలో యాసంగి వరి సాగు చేశాడు. పండిన ధాన్యాన్ని అదే గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి ఉంచాడు. అదే కొనుగోలు కేంద్రంలో దాదాపు 45 రోజులపాటు కనకయ్య ధా న్యం కొనకుండా అధికారులు తీవ్ర జాప్యం చేశారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షానికి ఆ వడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి.
ఐకేపీ కేంద్రం లో 42 కేజీల 700 గ్రాముల చొప్పున తూకం వేసి పంపారు. మిల్లర్లు వివిధ కారణాల చూపుతూ ధాన్యం దించుకోకుండా కొర్రీలు పెట్టారు. చివరకు మిల్లర్లను సదరు రైతు ప్రాధేయపడగా.. నాలుగు ట్రాక్టర్ల వడ్లకు (450 బస్తాలు) గాను ఏకంగా 40 సంచుల వడ్లను మిల్లర్లు తరుగు పేరిట కట్ చేశారు. దీంతో రైతు కనకయ్య అవమానంగా భావించాడు. ఆరుగాలం కష్టించి బంగారంలా పండిన ధాన్యాన్ని తెచ్చి అమ్మకానికి ఉంచితే.. అధికారుల నిర్లక్ష్యంతో తడిసిందని ఆవేదన వ్యక్తంచేశాడు. తీరా కొన్నాక 40 సంచుల ధాన్యం తరుగు తీసారంటూ మనస్తాపం చెందాడు. మనోవేదనతో శుక్రవారం రాత్రి వరకు తోటి రైతులతో, కుటుంబ సభ్యులతో చెప్పుకుంటూ కనకయ్య బాధపడ్డారు. ఆ ఒత్తిడితో నిద్రలోనే ఆయనకు గుండెపోటు వచ్చి ప్రాణాలిడిశాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

‘పంట పండించేందుకు ప్రాణం పెట్టా డు.. అదే పంట అమ్ముకొనేందుకు పోయి నేడు శవమైండు’ అని గుండెపోటుతో మృతిచెందిన రైతు పల్లెవేని కనకయ్య కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ధాన్యం అమ్ముకొనేందుకు వెళ్లిచ్చిన రైతు ఇంటికి చేరుకోగానే మనస్తాపంతో గుండెపోటుతో మరణించడంపై ఆ ఊరంతా కంటతడి పెట్టుకున్నది. సకాలంలో కనకయ్య ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే ఆయన మృతి చెందేవారు కాదని, ఆయన మరణంతో ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయినా ప్రభుత్వం స్పందించడం లేదని తోటి రైతులు మండిపడుతున్నారు.