హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ):కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ నుంచి ఇప్పటికీ నీళ్లు తీసుకురావచ్చని, అయినా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవటంలేదని హరీశ్రావు విమర్శించారు. మేడిగడ్డ దగ్గర నీళ్లు లేవని, రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని మంత్రులు సూచించటాన్ని ఆయన తప్పుబట్టారు. ‘ఎస్ఆర్ఎస్పీలో 4 లక్షల ఎకరాలకు బదులు 2 లక్షల ఎకరాలకే నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నది.
మేడిగడ్డ బరాజ్ మరమ్మతు జరుగుతున్నా గోదావరి నదిలో ఇప్పటికీ 4 వేల నుంచి 5 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నది. వీటిని ఇప్పటికీ కూడా ఎత్తిపోసి రైతాంగానికి పూర్తిస్థాయిలో నీరు ఇచ్చే అవకాశం ఉన్నది. మార్చి, ఎప్రిల్లో నీళ్లు అందక పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందే ప్రమాదం ఉన్నది. మేడిగడ్డ దగ్గర నీటిని లిఫ్ట్ చేసి మిడ్మానేరు, ఎల్ఎండీకి నీళ్లు తెచ్చుకోవచ్చు. ఎంతసేపు మాపై బురదజల్లాలని చూడటం కాకుండా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలవాలి.
మా మీద జల్లే బురదను ఎదుర్కొంటాం. అంతేకాని ప్రాజెక్టును ఫెయిల్యూర్ కింద చూపొద్దు. అవకాశం ఉన్న నీటిని సముద్రంపాలు చేయకుండా రైతులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. గత మూడేండ్లు మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నీటిని రైతులకు అందించాం. ఇప్పుడు ఆ రిజర్వాయర్లలో నీళ్లున్నాయి. వాటిని రైతులకు అందివ్వాలి. ప్రాజెక్టులు మేమే కట్టినం.. నీళ్లు మేమే తెచ్చినం.. వాటిని రైతులకు ఇవ్వటానికి అభ్యంతరం ఏమిటి?’ అని ప్రశ్నించారు.