హైదరాబాద్: వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. వానాకాలానికి ముందే నాలాలన్నీ శుభ్రం చేయాలని తెలిపారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్ హైదరాబాద్ నగరంలో నాలాలన్నిటినీ క్లీన్ చేయించేవారని చెప్పారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు శుభ్రం చేయకపోవడం వల్ల నాలాల నుంచి వరద వచ్చింది. హైదరాబాద్ సనత్నగర్లోని రాంగోపాల్పేట డివిజన్లో వరదలో మునిగిపోయిన పలు కాలనీలను పరిశీలించి, బాధితులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి హరీశ్ రావు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరద వల్ల ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయాయన్నారు. తినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క రూపాయి సహాయం కూడా వరద బాధితులకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు హైదరాబాద్లో ఏడెనిమిది మంది నాలాల్లో కొట్టుకుపోయి చనిపోయారన్నారు. వారి చావులకు కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు.
కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, రేవంత్ రెడ్డి పూర్తిగా బరితెగించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీసేలా రేవంత్ ప్రవర్తిస్తున్నాడని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని వెల్లడించారు. బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. పండుగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, ట్రాక్టర్లలో డీజిల్ పోయడానికి డబ్బులు లేవన్నారు. ఈ బతుకమ్మ పండుగ పూటైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి, అతిపెద్ద పండుగైన బతుకమ్మ పండుగను జరుపుకునేటట్టు చెయాలన్నారు.
Live: మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో వరదముంపుకు గురైన 1500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం.
📍రాంగోపాల్ పేట డివిజన్, హైదరాబాద్ https://t.co/TYTIAHX4fb
— Office of Harish Rao (@HarishRaoOffice) September 21, 2025