నల్లగొండ ప్రతినిధి, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే ఊడగొడుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ది మాట నిలబెట్టుకునే ప్రభుత్వమైతే.. బీజేపీది మాట తప్పే నైజమని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా మర్రిగూడలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనంతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే రోల్ మాడల్గా మారిందని చెప్పారు.
కేంద్రం విధిస్తున్నా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.. తెలంగాణ పథకాలను కేంద్రంతోపాటు వివిధ రాష్ర్టాలు కాపీ కొడుతున్నాయని ఉదహరించారు. ప్రజల అవసరాలను గుర్తించి పథకాలకు రూపకల్పన చేయడంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వ దవాఖానల ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మర్రిగూడలో 30 పడకల దవాఖానను పూర్తి స్థాయి వైద్య సిబ్బందితో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇదే మర్రిగూడలో నాలుగేండ్ల కింద అప్పటి కేంద్ర మంత్రి జేపీ నడ్డా.. ఫ్లోరైడ్ బాధితుల కోసం వంద పడకల దవాఖాన నిర్మిస్తామంటూ కొబ్బరికాయ కొట్టి మర్చిపోయారని విమర్శించారు.
డయాలసిస్ కేంద్రాలతో మార్గదర్శనం
డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, వాటి పనితీరులో దేశానికే రాష్ట్రం మార్గదర్శకంగా నిలిచిందని మంత్రి హరీశ్రావు వివరించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఇక్కడి చికిత్సను చూసి తమ రాష్ట్రంలో కూడా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలతోపాటు బస్పాసులు, ఆసరా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక 50 లక్షల డయాలసిస్ సెషన్లు పూర్తి చేశామని, ప్రస్తుతం 102 డయాలసిస్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నామని వివరించారు. క్యాన్సర్ పేషెంట్ల కోసం చౌటుప్పల్లో సైతం త్వరలోనే పాలియేటివ్ సేవలు అందిస్తామని అభయమిచ్చారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలో వంద పడకల దవాఖానను ప్రారంభిస్తామని ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని తెలిపారు.
కేసీఆర్ పాలన కోరుతున్న దేశ ప్రజలు : మంత్రి జగదీశ్రెడ్డి
రాష్ట్రంలోని సంక్షేమ పథకాలపై దేశ ప్రజలు విస్తృతంగా చర్చిస్తున్నారని, దేశానికి కేసీఆర్ పాలన కావాలని కోరుతున్నారని మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడులు సైతం జరుగుతుండటం సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు. మునుగోడు అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని, నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, వైద్య విధాన పరిషత్తు కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్, కలెక్టర్లు పమేలా సత్పతి, టీ వినయ్క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.