హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమాజం టీఆర్ఎస్ వెంటే ఉన్నదని మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో మరోసారి రుజువైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ ఎన్నికలో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజలు చైతన్యానికి మారుపేరుగా నిలిచారని ప్రశంసించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, బీజేపీ కుట్రలకు మధ్య జరుగుతున్న పోరాటంలో టీఆర్ఎస్ పక్షాన నిలిచిన మునుగోడు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డిని అక్కున చేర్చుకొని నియోజకవర్గ ప్రజలపై బలవంతంగా ఉప ఎన్నికను రుద్దిందని నిప్పులు చెరిగారు. కాషాయ మూకల అహంకారాన్ని మునుగోడు ప్రజలు అణచివేశారని పేర్కొంటూ.. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని ఆకాంక్షించారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాంది
మునుగోడులో టీఆర్ఎస్ విజయం.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పునకు నాందీవాచకమని మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి కొత్త దశ, దిశ అందిస్తుందని ఈ ఉప ఎన్నిక ద్వారా ప్రజలు సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారనడానికి ఈ విజయం మరో నిదర్శనమని తెలిపారు. అధికారం, డబ్బు, ప్రలోభాల కంటే ప్రజాస్వామ్యం గొప్పదని మునుగోడు ప్రజలు చాటిచెప్పిన వైనం చరిత్రాత్మకమన్నారు. తెలంగాణకు కావాల్సింది విద్వేషం, విషం కాదని.. అభివృద్ధి, సంక్షేమమేనని మునుగోడు ప్రజలు స్పష్టం చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన నాయకత్వ స్ఫూర్తితో ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన సీపీఐ, సీపీఎంకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.