సిద్దిపేట, నమస్తే తెలంగాణ ప్రతినిధి/వేల్పూర్/పాలకుర్తి రూరల్, జనవరి 22 : కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. రెండో రోజైన శనివారం ఊరూ-వాడా అనే తేడా లేకుండా అన్ని చోట్ల సర్వే చేపట్టారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టెంపరేచర్ చూడటంతోపాటు ఆరోగ్య లక్షణాలను తెలుసుకొన్నారు. కరోనా లక్షణాలుంటే అక్కడికక్కడే పరీక్ష చేసి పాజిటివ్ వస్తే వెంటనే మందుల కిట్ అందజేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా టెంపరేచర్ చెక్ చేయించుకొంటున్నారు. ఏ లక్షణాలున్నా వైద్య సిబ్బందికి చెప్తూ ప్రజలు వారికి పూర్తిగా సహకరిస్తున్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు (జే), శాతాపురం గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు.
పదిరోజుల్లో సర్వే పూర్తి: హరీశ్రావు
కరోనా వ్యాపి పెరుగుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఇంటింటా జ్వర సర్వే చేపడుతున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. వారం, పది రోజుల్లో సర్వే పూర్తవుతుందని, వ్యాధిలక్షణాలు ఉన్నవారికి వెంటనే ఐసొలేషన్ కిట్ ఇస్తున్నామని చెప్పారు. సిద్దిపేటలోని 37 వార్డులో ఫీవర్ సర్వేను పరిశీలించిన సందర్భంగా హరీశ్రావు మీడియాతో మా ట్లాడుతూ.. రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ పడకలు సిద్ధం చేశామన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదరుర్కొనేందుకు ప్రభు త్వం సిద్ధ్దంగా ఉన్నదని తెలిపారు. రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు అన్ని దవాఖానల్లో అందుబాటులో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు. కోటి హోం ఐసొలేషన్ కిట్లను పంపించామన్నారు. ‘స్థానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానకు రండి.. మీ ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్చేయండి. వాళ్లు మీకు అవసరమైన మందులు ఇస్తారు. తగిన జాగ్రత్తలు చెప్తారు’ అని హరీశ్రావు తెలిపారు.
ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ ధ్యేయం: ఎర్రబెల్లి
ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ ధ్యేయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు(జే), శాతాపురం గ్రామాల్లో ఫీవర్ సర్వేను పరిశీలించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఫీవర్ సర్వే రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్నదన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఈ సర్వే చేస్తున్నామని తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు ఉంటే కరోనా పరీక్ష చేయించుకోవాలన్నారు.
జ్వర సర్వేపై ఆరా తీసిన వేముల
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో జ్వర సర్వేతీరును ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సిబ్బంది దగ్గర వివరాలను తీసుకొని మంత్రి స్వయంగా గ్రామస్థులకు ఫోన్ చేసి మాట్లాడారు. ‘ఆరోగ్య సిబ్బంది మీ ఇంటికి వచ్చి సర్వే చేశారా?’ అని ఆరా తీశారు. ఎవరికి ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా వెంటనే స్పందించి వారికి ఉచితంగా మందులు అందజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు.
హరీశ్రావు ఆత్మీయ పలుకరింపు
సిద్దిపేట పట్టణంలో ఫీవర్ సర్వే సందర్భంగా మంత్రి హరీశ్రావు మహిళలు, వృద్ధులు తదితరులను ఆత్మీయంగా పలుకరించారు. ఇంటింటికీ తిరుగుతూ అందరితో మాట్లాడుతూ ఆరోగ్యం ఎట్లా ఉన్నది? టీకాలు వేసుకున్నరా? అంటూ ఆరా తీస్తూ ముందుకు సాగారు. స్థానికులతో మాటామంతి ఇలా..
మంత్రి: ఏం పోశవ్వ ఎన్ని టీకాలు వేసుకున్నవ్?
పోశవ్వ: ఒక్కటే ఏసుకున్న సార్.
మంత్రి: రెండోది ఎందుకు ఏసుకోలే?
పోశవ్వ: భయమైతాంది సార్
మంత్రి: ఎందుకు భయం నేనున్నా కదా? నువ్వు ఏసుకో.. (దగ్గరుండి టీకా వేయించారు)
పోశవ్వ: నువ్వున్నవనే ధైర్యం వచ్చింది..
ఏసుకున్న సార్.. (నవ్వుతూ సమాధానం చెప్పిన పోశవ్వ)
మంత్రి: దేవవ్వ ఎటు పోతున్నవ్?
ఎన్ని టీకాలు వేసుకున్నవ్?
దేవవ్వ: వేసుకున్న సార్
మంత్రి: రెండు ఏస్కోవాలే.. 60 ఏండ్లు నిండితే మూడోది కూడా ఏస్కోవాలే