సిద్దిపేట: పిల్లలకు మంచి చదువు, నాణ్యమైన వైద్యం అందించేందుకు తాము కృషి చేశామని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్కు మద్దతుగా ఉంటామని ముందుకొచ్చినందుకు అసోషియేషన్ సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో తెలంగాణ ప్రాంతం బాగా వెనుకబడి ఉండెనని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు.
తెలంగాణ ఏర్పడకముందే బీడు భూములు కనిపించేవని, తర్వాత కాలువలతో సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేశామని మంత్రి తెలిపారు. గతంలో పంటలు పండక రైతుల ఆత్మహత్యలు ఉండేవని, ఇప్పుడు నాణ్యమైన విద్యుత్, డ్రిప్, వ్యవసాయ పనిముట్లు, రైతు బంధు, రైతు బీమా వంటి సదుపాయాలతో ఆ పరిస్థితులు లేకుండా పోయాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఉన్న కర్ణాటకలో రోజూ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడకముందు 268 గురుకులాల ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 1000 దాటిందని చెప్పారు. కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇచ్చినా ఏంచేయలేదని, ఇప్పుడు మరో ఛాన్స్ అని అడుగుతోందని విమర్శించారు.
కేసీఆర్ సీఎం అయిన తర్వాత గురుకులాలల్లో విద్యను ఇంటర్ వరకు పెంచారని, విద్యార్థులకు ఎంసెట్, నీట్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు గురుకులాల్లో చదివిన 6,652 మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యారని తెలిపారు. భవిష్యత్లో గురుకులాలను డిగ్రీ వరకు పెంచే కృషి జరుగుతోందన్నారు. అంతేగాక విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారికి రూ.20 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. గురుకులాల్లో గత ఎనిమిదేండ్లుగా విద్యార్థులకు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. అగ్రవర్ణ పేదల కోసం త్వరలోనే 119 నియోజక వర్గాల్లో గురుకులాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. బిడ్డ తల్లి చేతుల్లో ఎంత భద్రంగా ఉంటదో, కేసీఆర్ చేతుల్లో తెలంగాణ అంత భద్రంగా ఉంటదని అన్నారు. బీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరారు.