హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : తమ ప్రభుత్వం ఐటీ పార్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించినచోట కాంగ్రెస్ సర్కార్ డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో 86 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సిద్దాపూర్లో డంప్ యార్డు ఏర్పాటు నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న రైతులు, చుట్టుపకల గ్రామాల ప్రజలు హైదరాబాద్లో సోమవారం హరీశ్రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా తమపక్షాన పోరాడాలని, తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రైతుల వినతిపై స్పందించిన హరీశ్రావు ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. సిద్దాపూర్తో పాటు చుట్టుపకల ఉన్న దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల ప్రజలంతా పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి అవసరమైన కూరగాయలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకొని ఉన్న గుట్ట చెరువు నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేసుకొంటున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ చెరువు పకనే డంప్ యార్డు పెడితే నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటితోపాటు తాగునీటికీ తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.
డంప్ యార్డుకు కేటాయించిన సర్వే నంబర్లు 252, 278, 361లో ఉన్న 334 ఎకరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ పార్ నిర్మించాలని ప్రణాళికలు రూపొందించినట్టు హరీశ్రావు గుర్తుచేశారు. ఉపాధి కల్పించాల్సిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడటం శోచనీయమని మండిపడ్డారు. యువతకు అవకాశాలు కల్పించాల్సినచోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బందులు కలుగని, జనావాసాలు లేనిప్రాంతాల్లో డంప్యార్డు ఏర్పా టు చేయాలని, పచ్చని పల్లెలు, పొలాలు, రైతులను ఆగమాగం చేయడం తగదని సూచించారు. ప్రభుత్వం వెంటనే సిద్దాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నష్టపోతున్న 20 గ్రామాల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పెద్దఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.