హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాదని, ప్రజా సమస్యలపై మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారు..ప్రజలెదుర్కొంటున్న ఒక్క సమస్యపైనా చర్చ జరిగిందా..? ఒక్క ప్రభుత్వ విధానంపై సమాధానం చెప్పారా?’అని ప్రశ్నించారు. ప్రతిపక్షాన్ని వేధించడం..గొంతు నొక్కడం..బయటకు పంపడం తప్ప ప్రజల ఇబ్బందులపై ఈ సర్కార్కు పట్టింపు లేదని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపించడం అప్రజాస్వామికమని ఖండించారు.
‘అసెంబ్లీ సమావేశాల్లో సార్..మా సమస్యపై మాట్లాడండి..’అంటూ ఎన్నో వర్గాల ప్రజలు మమ్మల్ని కలిసి వినతిపత్రాలు ఇచ్చారు..వందలాది మంది ఎంతో ఆశగా ఫోన్లు చేస్తున్నారు.. మెసేజ్లు పెడుతున్నారు.. మా గొంతును అసెంబ్లీలో వినిపించమని ప్రాధేయపడుతున్నారు.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ఎప్పుడు పూర్తిచేస్తారని ఆర్టీసీ ఉద్యోగులు, నిషేధిత జాబితా నుంచి మా భూములు ఎప్పుడు తొలగిస్తారని రైతులు, బాధితులు జీవో 97 రద్దు ఎప్పుడని పాలిటెక్నిక్ విద్యార్థులు అడుగుతున్నరు..ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, డీఏ, పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు, కారుణ్య నియామకాల కోసం సింగరేణి ఉద్యోగులు, పింఛన్ల పెంపు కోసం అవ్వాతాతలు ఎదురుచూస్తున్నారు. మేం ఏం చేయాలి? బాధపడడం తప్పా?’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రజాసమస్యలపై నిలదీసే బీఆర్ఎస్ గొంతును సస్పెన్షన్ పేరిట నొక్కాలని చూస్తున్నారని హరీశ్రావు మండిపడ్డారు. గుర్తుంచుకోండి రేవంత్రెడ్డి.. మైక్లు కట్ చేసో.. సస్పెన్షన్ విధించో అసెంబ్లీలో మా గొంతును అణచివేయవచ్చు.. కానీ ప్రజాక్షేత్రంలో చేయలేరు, ఎంతగా అణగదొక్కితే అంత బలంగా ప్రజల తరఫున పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. హిట్లర్ తనకు ఆదర్శమని చెప్పుకొన్న రేవంత్రెడ్డి.. హిట్లర్ తరహా నియంతృత్వ ధోరణులతో పాలన సాగిస్తే, చరిత్ర ఇచ్చే తీర్పు నుంచి ఎవరూ తప్పించుకోలేరని చెప్పారు. ‘కేసీఆర్పై మీరు చేసిన అవమానాలు, వ్యక్తిగత దూషణలు, రాజకీయ కక్ష సాధింపులను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ప్రజలే అంతిమ న్యాయమూర్తులు. తెలంగాణ ప్రజలే మీకు తగిన గుణపాఠం చెబుతారు. ప్రజాసమస్యలపై సమాధానం చెప్పే వరకు.. వెనకి తగ్గదు.నియంతృత్వం ఎంత పెరిగితే.. ప్రజా తిరుగుబాటు అంత బలపడుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి’ అని హెచ్చరించారు.