Harish Rao | రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. పడకేసిన పల్లె వైద్యం.. మంచమెక్కిన మన్యం.. సీజనల్ వ్యాధులతో జనం విలవిల.. ఊరంతా విషజ్వరాలే.. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లమని.. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తారు. జ్వరాలతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వ నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని అర్థం. పాలన గాడితప్పడం, పారిశుద్ధ్యం పడకేయడంతో పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రజలు రోగాల బారిన పడుతున్నరు. రాష్ట్రవ్యాప్తంగా మలేరియా, డెంగీ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తున్నాయని తెలిపారు.
ప్రతి రెండు ఇండ్లలో ఒకరు వైరల్ ఫీవర్తో వణికిపోతున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేక, డెంగీ కిట్స్ లేక రోగులు ప్రైవేటు దవాఖానాలకు వెళ్లి అప్పుల పాలవుతున్నారన్నారు. ఇదంతా చూసీచూడనట్లు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు. తప్పుడు లెక్కలు విడుదల చేస్తూ, విషజ్వరాల కేసులను తక్కువ చేసి చూపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ద ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషజ్వరాల కారణంగా ఏ ఒక్కరు ప్రాణం కోల్పోకుండా చూడాలని.. విషజ్వరాలు విజృంభించిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వైద్యం అందించాలన్నారు. పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగు పరచాలని.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, డెంగీ కిట్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.