Harish Rao | అశ్వరావుపేట పెద్దవాగుకు గండి, కట్ట కొట్టుకుపోయిన ఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగానే పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిందని మండిపడ్డారు. రైతులు హెచ్చరించినప్పుడే జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై గేట్లు తెరిచి ఉంటే రూ.వందకోట్ల నష్టం జరిగేది కాదన్నారు. కట్టమీద నుంచి నాలుగైదు గంటల పాటు నీళ్లు పొంగిపొర్లుతుంటే గేట్లు ఎత్తకుండా అధికారులు ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. మూడు గేట్లుంటే.. రెండు గేట్లే ఎత్తడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పెద్దవాగు ప్రాజెక్టు బద్దలై.. గుమ్మడివల్లి గ్రామాన్ని ముంచేసి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం ప్రదర్శించి వందల మంది గిరిజన బిడ్డల ప్రాణాలు ఫణంగా పెట్టారని హరీశ్రావు ధ్వజమెత్తారు.
పెద్దవాగు ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలోనే ఉన్నదని, పర్యవేక్షణ చేస్తున్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులేనన్నారు. ప్రాజెక్టుకు గండి పడడంతో గుమ్మడివల్లి, రంగాపురం, కోయరంగాపురం, బుచ్చువారిగూడెం, నారాయణపురం గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలతోపాటు, పశుసంపదకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. పెద్దవాగు ప్రాజెక్టు ఘటన ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని హరీశ్రావు స్పష్టం చేశారు. రక్షించండని అధికారులకు ఫోన్ చేసినా కనీస స్పందన లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హెలికాఫ్టర్లు సరైన కాలంలో రాకంటే ఆ రోజు వరదలో చిక్కుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దవాగు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు దారుణమన్న హరీశ్ రావు, ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు రోజులైనా మంత్రులకు తీరిక దొరకలేదా? అంటూ నిలదీశారు. ముగ్గురు మంత్రులుండి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఒరగబెట్టింది ఏమిటని నిలదీశారు. ఇసుకమేట వేసిన ప్రతి ఎకరాకు రూ.25వేలు చెల్లించి రైతులను ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం కింద ఎకరాకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయాలని.. పశువులు కోల్పోయిన రైతులకు ప్రకృతి వైపరీత్య నిధి నుంచి ప్రభుత్వం వెంటనే సహాయం హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కారణాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.