Harish rao | హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): రాజకీయాల కోసం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టొద్దని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఒక బరాజ్ మాత్రమేనని తెలిపారు. అక్కడ ఏదైనా లోపం జరిగితే దానిని సరిచేసి రైతులకు నీరందించాలని కోరారు. రాజకీయాల కోసం రైతులకు నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ముందే నిర్ణయించిన నల్లగొండ సభకు పోటీగా సీఎం బృందం మేడిగడ్డ పర్యటన చేపట్టిందని ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం అనంతరం హరీశ్రావు మీడియా పాయింట్వద్ద మాట్లాడారు. శాసనసభ నిర్వహిస్తున్న తీరును ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అసెంబ్లీలో మాట్లాడి ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ప్రజాస్వామ్య విలువలు మంటగలిపే విధంగా ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కాళేశ్వరం సమగ్ర స్వరూపం చాలా మందికి తెలియదని, కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డనే కాదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని సూచించారు. కాళేశ్వరం అంటే మూడు బరాజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్హౌజ్లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల సామర్థ్యంగల స్టోరేజ్, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయడం, 240 టీఎంసీల ఉపయోగం వీటన్నింటి సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని వివరించారు. ఒక బరాజ్లో ఒకటి రెండు పిల్లర్లు కుంగిపోతే కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వెళ్లే దారిలో రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కూడవెల్లి వాగు, పచ్చటి పొలాలు చూడాలని హరీశ్రావు చురకలంటించారు. కాళేశ్వరం ఫలితాలు దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, బెజ్జంకి, కరీంనగర్లో రైతులను అడిగితే చెప్తారని అన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చి మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ను సందర్శించారని, అద్భుతం అంటూ మెచ్చుకున్నారని గుర్తుచేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధిపొందాలని చూస్తున్నదని హరీశ్రావు ఆరోపించారు.
ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద 2007లో ప్రారంభించి, కడితే ఎవరు వద్దన్నారని హరీశ్రావు ప్రశ్నించారు. 2007 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది కదా? మిమ్మల్ని ఆపిందెవరు? అని నిలదీశారు. అప్పుడు అనుమతులు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించాలంటే చాప్రాల్ వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఉన్నదని, అక్కడ కట్టాలంటే అనుమతులు రావని గుర్తుచేశారు. అక్కడ నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పిందని అన్నారు. తమ ప్రభుత్వం నీళ్లున్న దగ్గర ప్రాజెక్టు కట్టి.. పంటలకు పారించిందని చెప్పారు. సాగునీరందింది కాబట్టే కోట్లాది టన్నుల వరి ధాన్యం పండిందని తెలిపారు. కాళేశ్వరం నీళ్లు ఎస్సారెస్పీ స్టేజ్ -2, ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాలో పారాయని తెలిపారు. కాళ్వేరం ప్రాజెక్టులో ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి, చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆ పని చేయకుండా గత ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సర్కారుపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పంజాగుట్ట ఫ్లై ఓవర్ కూలి 20 మంది చనిపోయారని, పుట్టంగండి రిజర్వాయర్ సీఎం ప్రారంభిస్తే నీళ్లు బయటికిపోతే బంద్ చేశారని గుర్తుచేశారు. దేవాదుల ప్రాజెక్టు పంపులు ఆన్ చేయగానే పటాకుల్లాగా పైపులు గాల్లోకి ఎగిరాయని, దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనలు జరుగుతాయని అన్నారు. కాంగ్రెస్వి అన్నీ దివాలాకోరు రాజకీయాలని దుయ్యబట్టారు. కృష్ణా జలాలపై ముందుగానే తేదీని ప్రకటించి సభ పెట్టామని, ప్రజా ఉద్యమాన్ని లేవనెత్తామని చెప్పారు. అప్పటివరకు ప్రభుత్వం నిద్రపోయిందని, నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసిందని అన్నారు. బీఆర్ఎస్ సభ ఉన్నదనే కాంగ్రెస్ సర్కారు పోటీగా మేడిగడ్డ టూర్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.