Harish Rao | ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారని.. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారని.. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పీఏల పేరుమీద భూములు కొంటున్నారన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడుతానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గిందని.. రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డీకే అరుణను గెలిపించారని విమర్శించారు. మోదీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారన్నారు. రుణమాఫీపై తాము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారన్నారు.
సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరమని హరీశ్రావు అన్నారు. వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయని.. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా..? అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. కవిత బెయిల్ విషయంలో న్యాయం, ధర్మం గెలిచిందని.. ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందన్నారు. సిసోడియాకు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా..? అంటూ నిలదీశారు. కవితకు బెయిల్ రావడాన్ని కేశవరావు స్వాగతించారన్నారు.
బుద్ధ భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం నాలాపై ఉన్నాయని.. మొదట వాటిని కూల్చాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. తమ ఎమ్మెల్యే రాజశేఖర్రెడ్డి భవనాలు ఎలా కూలగొడుతారని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్, హోటల్స్, క్లబ్స్ దేని కింద ఉన్నాయని ప్రశ్నించారు. మీర్ఆలం, ఉప్పల్, రామంతాపూర్ చెరువులో పెద్దపెద్ద టవర్లు ఉన్నాయని.. అవన్నీ పట్టాభూములు.. వారికి పరిహారం ఇవ్వాలన్నారు. మంత్రి పొంగులేటి నివాసం నుంచి డ్రైనేజీ నీళ్లు ఎక్కడికి పోతున్నాయని.. ముఖ్యమంత్రి పరోక్షంగా తనమంత్రిని తిడుతున్నారా? అంటూ చురకలంటించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం మంచిదికాదన్నారు. చిత్తశుద్ధి ఉంటే హైడ్రా పరిధిలోని ఆక్రమణలు కూల్చివేయాలన్నారు. చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్, నాలాలపై ఉన్న ఆస్తులను కూల్చివేయాలన్నారు. కాళేశ్వరం మరమ్మతుల విషయంలో నాకే అవకాశం ఇస్తామన్నారని.. నేను సిద్ధపడితే రేవంత్రెడ్డి తోక ముడిచారని విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేస్తే మంత్రులు కూడా లేరన్నారు.