Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టి సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నీళ్లు ఎత్తిపోసేందుకు అవకాశం ఉన్నా కూడా ఆ చర్యలు చేపట్టడం లేదు. వాళ్లకు చేతకాకపోతే రేవంత్ను రాజీనామా చేయమను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తానని హరీశ్రావు చెప్పారు.
తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో 94 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే.. మా హయాంలో మూడు కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండినయ్.. మ్యాజిక్ చేస్తేనో, మంత్రమేస్తనో పండుతాయా..? మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట ఎందుకు పండింది. మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది కనుక దాని మీద బురద జల్లాలి. ఏదో ఒక రకంగా మాకు చెడ్డ పేరు తెచ్చి, ప్రజల్లో అనుమానాలు కలిగించే విధంగా దుష్ర్పచారానికి వాళ్లు పాల్పడుతున్నారు. కానీ నిజం నిలకడ మీద తెలుస్తది. మేం రిజర్వాయర్లు నింపి పెట్టినం కనుక యాసంగికి నీళ్లు పోతున్నాయి ఇబ్బంది లేదు. వచ్చే యాసంగికి నీళ్లు రాలేదు అనుకో. కేసీఆర్ ఉన్నంగ నీళ్లు వచ్చినయ్.. ఇప్పుడు ఎందుకు వస్తలేవు అని ప్రజలు ఆలోచించరా..? అని హరీశ్రావు అడిగారు.
ఇప్పటికీ నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉంది. అదే విషయాన్ని ఇంజినీర్లు కూడా చెబుతున్నారు. వాళ్లకు చేతకాకపోతే మాకు ప్రభుత్వాన్ని అప్పజెప్పమనండి. మేం చేసి చూపిస్తాం. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమను. నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ను దిగమను. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి చూపిస్తా. నాకు మద్దతు ఇస్తా అంటే ఐయామ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేతకాదు.. హరీశ్రావు నీవు చేయ్ అంటే చేసి చూపిస్తా. రైతులకు నష్టం కలగకుండా పునరుద్ధరణ చర్యలు చేపట్టమని కోరుతున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఎవరు ఎన్నేండ్లు ముఖ్యమంత్రి ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి అని చెబుతున్నాం. మీరు బాగా చేస్తే ఆదరిస్తారు.. లేదంటే బండకేసి కొడుతారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి కేసీఆర్ను కాల్చేయాలి, ఉరితీయాలని మాట్లాడిండు. ఆయన అలా మాట్లాడొచ్చా..? అని హరీశ్రావు అడిగారు.