సిద్దిపేట: చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. విద్యతోపాటు క్రీడల్లో పోటీతత్వం అలవర్చుకోవాలని సూచించారు. చదవుతోపాటు ఆటల్లో ప్రతిభ చూపించినవారికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. సిద్దిపేట ఫుట్బాల్ స్టేడియంలో ఇంటర్స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని జాతీయ స్థాయి ఆటలకు సిద్దిపేట వేదికగా నిలిచిందన్నారు. ఆటలు అదుర్స్ అనేలా అన్ని వేదికలను పట్టణంలో ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని ఆటలకు నెలవుగా సిద్దిపేట మారిందని చెప్పారు. పాఠశాలల స్థాయికే పరిమితమైన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు పంపేల సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 16 రకాల క్రీడలకు సంబంధించిన మైదానాలు, కోర్టులు, సౌకర్యాలను ఏర్పాటు చేశామని, దీంతో అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు అతిథ్యం ఇచ్చామన్నారు. స్విమ్మింగ్ ఫుల్ జాతీయ స్థాయిలో పోటీలకు, బ్యాడ్మింటన్, వాలిబాల్ రాష్ట్ర జాతీయ స్థాయి సెలెక్షన్స్, ఫుట్బాల్ సెలెక్షన్స్, రంగనాయక సాగర్ వద్ద జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు సిద్దిపేట వేదికయిందని చెప్పారు.
సిద్దిపేట స్పోర్ట్స్ కాంప్లెక్స్ను మరో రూ.11 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని, క్రికెట్ స్టేడియానికి రూ.4 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, హాకీ, కరాటే, రన్నింగ్, హ్యాండ్ బాల్, షాట్పుట్, స్కెటింగ్, అథ్లెటిక్స్ తోపాటు ఇటీవలే నూతన వాలీబాల్ అకాడమీ ఏర్పాటైందని చెప్పారు.