హైదరాబాద్: సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతుబంధు పథకాన్ని శాశ్వతంగా బంద్ పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ.500 బోనసే మేలని రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ.26 కోట్లు మాత్రమేనని చెప్పారు. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుందని తెలిపారు. మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారని విమర్శించారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బందు చేస్తారని కేసీఆర్ గారు ముందే హెచ్చరించారని గుర్తుచేశారు. అనుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నదని చెప్పారు.
రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా అని ప్రశ్నించారు. రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి అని నిలదీశారు. మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. శనివారం మహబూబ్నగర్లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గుచేటు.
రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం.
ప్రపంచంలో రైతుకు… pic.twitter.com/b4bg9UvSqV
— Harish Rao Thanneeru (@BRSHarish) November 30, 2024